Begin typing your search above and press return to search.

ఆ సినిమా కోసం గోల్డ్ తాకట్టుపెట్టాను!

By:  Tupaki Desk   |   20 Jun 2022 11:30 PM GMT
ఆ సినిమా కోసం గోల్డ్ తాకట్టుపెట్టాను!
X
ఎమ్మెస్ రాజు .. టాలీవుడ్లో ఒకప్పుడు బడా ప్రొడ్యూసర్. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆయన నిర్మించిన సినిమాలు కొన్ని భారీ విజయాలను సాధించాయి. శత్రువు .. వర్షం .. ఒక్కడు .. ఇలా ఆయన బ్యానర్ నుంచి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. నిర్మాణ విలువల విషయంలో ఎంత మాత్రం రాజీపడనీ నిర్మాతగా ఆయనకి మంచి పేరు వచ్చింది. ఆయన సినిమాల్లో చేయడానికి స్టార్స్ అంతా కూడా ఉత్సాహాన్ని చూపిస్తూ వచ్చారు. అలాంటి ఎమ్మెస్ రాజుకి ఆ తరువాత ఫ్లాపులు ఎదురవుతూ వచ్చాయి.

ప్రస్తుతం ఆయన తన బ్యానర్ పై సొంత నిర్మాణాలను పక్కన పెట్టేసి, దర్శకుడిగా ముందుకు వెళుతున్నారు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన '7 డేస్ 6 నైట్స్' సినిమా, ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఎమ్మెస్ రాజు మాట్లాడుతూ .. " ఇండస్ట్రీలో నిర్మాతగా ఒకప్పుడు ఒక స్థాయిని చూశాను. అక్కడి నుంచి గ్రాఫ్ తగ్గడం మొదలైన తరువాత నా పనైపోయిందనే అంతా చెప్పుకున్నారు. 'దేవీ' సినిమా కోసం ఇంట్లో ఉన్న బంగారం కూడా తాకట్టు పెట్టినవాడిని నేను. అలాంటి పరిస్థితుల నుంచే తేరుకున్నాను.

సాధారణంగా ఎవరైనా పడిపోతే వాడిపై తలా ఒక రాయి వేయడానికి ట్రై చేస్తారు. కానీ నా విషయంలో మాత్రం అలా జరగలేదు. కొంతమంది తప్పించుకుని తిరిగారు .. నేను ఊహించని కొంతమంది ముందుకు వచ్చి అండగా నిలబడ్డారు. అలాంటి పరిస్థితుల్లో నేను కుంగిపోలేదు .. నా అనుభవం నాకు ఇక్కడే ఉపయోగపడింది .. అది నేర్పిన పాఠాలు నన్ను నిలబెట్టాయి. ఇప్పుడు కూడా నేను జరిగిపోయినవాటిని గురించి ఆలోచన చేయడం లేదు. నెక్స్ట్ నేనేం చేయాలి? అనే విషయాన్ని గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నాను.

ఇప్పుడు పెద్ద హీరోలతో పెద్ద సినిమా లు చేయవచ్చును గదా అని చాలామంది అడుగుతున్నారు. ఇటు ఇండస్ట్రీలోను .. అటు ఆడియన్స్ లోను ఇప్పుడు చాలా మార్పువచ్చింది. ఆ మార్పును అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లవలసి ఉంటుంది.

దర్శకుడిగా ఓ మాదిరి బడ్జెట్ సినిమాలు చేసుకుంటూ వెళ్లడం నాకు కంఫర్ట్ గా ఉంది. అందువలన నిర్మాణం వైపు వెళ్లకుండా దర్శకుడిగానే ముందుకు వెళ్లాలనే నిర్ణయంతో ఉన్నాను. త్వరలో మా అబ్బాయి సుమంత్ కి కూడా మంచి బ్రేక్ వస్తుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చారు .