Begin typing your search above and press return to search.

సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన క్రేజీ డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   2 Aug 2022 6:31 AM GMT
సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన క్రేజీ డైరెక్టర్..!
X
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. తీసింది నాలుగు సినిమాలే అయినా.. ఇప్పుడు అతనితో వర్క్ చేయడానికి స్టార్ హీరోలందరూ ఆసక్తి చూపుతున్నారు. తనదైన శైలి స్క్రీన్ ప్లే మరియు యాక్షన్ తో ప్రేక్షకులను కట్టిపడేసే లోకేష్.. ఇటీవలి 'విక్రమ్' చిత్రంతో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు.

విశ్వనటుడు కమల్‌ హాసన్ ప్రధాన పాత్రలో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ''విక్రమ్'' సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సాధించింది. కోలీవుడ్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి కమల్ సత్తా ఏంటో ప్రూవ్ చేసింది. డిస్నీ+హాట్‌ స్టార్‌ లోనూ రికార్డు స్థాయిలో వ్యూస్ నమోదు చేస్తోంది. సూర్య - విజయ్ సేతుపతి - ఫహాద్ ఫాజిల్ వంటి స్టార్స్ ని పెట్టుకుని సినిమాని హ్యాండిల్ చేసిన విధానానికి లోకేశ్ కు ప్రశంసలు దక్కుతున్నాయి.

ఈ నేపథ్యంలో లోకేష్ కనకరాజ్ తదుపరి చిత్రం గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో టాలెంటెడ్ డైరెక్టర్ అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చాడు. బ్లాక్ బస్టర్ 'విక్రమ్' తర్వాత సోషల్ మీడియాకి దూరం అవుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు. అయితే అది తాత్కాలికమని చెప్పడం ఫ్యాన్స్ కి కాస్త ఊరట కలిగిస్తోంది.

''హలో గైస్.. నేను అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ ఫారమ్‌ల నుండి చిన్న విరామం తీసుకుంటున్నాను... నా తదుపరి సినిమా ప్రకటనతో నేను త్వరలో తిరిగి వస్తాను. అప్పటి వరకూ అందరూ జాగ్రత్తగా ఉండండి.. ప్రేమతో మీ లోకేష్ కనగరాజ్'' అని దర్శకుడు ఓ నోట్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

లోకేష్ కనగరాజ్ తన తదుపరి చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో చేస్తున్నట్లు ఇప్పటికే ధ్రువీకరించారు. తాత్కాలికంగా 'దళపతి 67' అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విజయ్ 'వారసుడు' సినిమా తర్వాత ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుంది.

'మా నగరం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన లోకేష్.. 'ఖైదీ' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 'మాస్టర్' మూవీతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. లేటెస్టుగా ''విక్రమ్'' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ముఖ్యంగా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) కి ఆడియన్స్ ఫిదా అయ్యారు.

'ఏజెంట్ విక్రమ్' - 'ఖైదీ' పాత్రలతో 'విక్రమ్'' మూవీని రూపొందింది కొత్త ప్రయత్నం చేసాడు. అంతేకాదు 'ఖైదీ 2' 'విక్రమ్ 3' లకు లీడ్ వదిలి అందరిలో ఆసక్తిని రెట్టింపు చేసాడు. ఇప్పుడు విజయ్ చిత్రాన్ని కూడా అందులో భాగంగా తీస్తారేమో అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో Thalapathy67 స్పెషల్ మూవీగా ఉంటుందా లేక LCUలో భాగమవుతుందా అనేది త్వరలో తెలియజేస్తానని లోకేష్ ఇటీవల తెలిపారు.

ఇదిలా ఉంటే గత కొంతకాలంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో దర్శకుడు ఓ మూవీ చేస్తారని టాక్ నడుస్తోంది. ఇప్పటికైతే ఇద్దరి మధ్య ఏ ప్రాజెక్ట్ గురించి చర్చించలేదని చెప్పిన లోకేష్.. భవిష్యత్ లో ఇద్దరి కలయికలో సినిమా ఉంటుందని హింట్ ఇచ్చాడు. మరి రానున్న రోజుల్లో ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.