Begin typing your search above and press return to search.

'ప్రాజెక్ట్‌ K' ఫస్ట్‌ డే షూట్ తర్వాత డైరెక్టర్‌...!

By:  Tupaki Desk   |   25 July 2021 4:29 AM GMT
ప్రాజెక్ట్‌ K ఫస్ట్‌ డే షూట్ తర్వాత డైరెక్టర్‌...!
X
ప్రభాస్‌ హీరోగా మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సినిమా ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన అభిమానులకు సినీ ప్రేమికులకు చిత్ర యూనిట్‌ సభ్యులు నిన్న గుడ్ న్యూస్ చెప్పారు. గురు పూజోత్సవం సందర్బంగా షూటింగ్ ను ప్రారంభించినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ప్రాజెక్ట్‌ K అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ మొదటి రోజు అమితాబచ్చన్‌ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన సెట్టింగ్‌ లో అమితాబచ్చన్‌ పై మొదటి షాట్ ను ప్రభాస్ క్లాప్‌ కొట్టగా చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ ను హఠాత్తుగా మొదలు పెట్టడంతో అంతా కూడా అవాక్కవుతున్నారు. ఉన్నట్లుండి మొదలు పెట్టడం వెనుక కారణం ఏంటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు మాత్రం ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభం అవ్వడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక మొదటి రోజు షూట్‌ పూర్తి అయిన తర్వాత దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ సోషల్‌ మీడియాలో తన ఫీలింగ్‌ ను షేర్‌ చేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత షూటింగ్‌.. ఇది చాలా రోజులు కొనసాగబోతుంది. అయితే అమితాబచ్చన్‌ వంటి లెజెండ్రీ తో సినిమా ప్రారంభం అవ్వడం గౌరవం. ఈ గురు పూర్ణిమ రోజున సినిమా ప్రారంభించడం పట్ల నాగ్‌ అశ్విన్‌ చాలా సంతోషంను వ్యక్తం చేశాడు. ట్విట్టర్ లో నాగ్‌ అశ్విన్‌ ట్వీట్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ అభిమానులు ఈ ట్వీట్ ను రీ ట్వీట్‌ చేయడంతో పాటు ఒక అద్బుతమైన సినిమా మీ నుండి వస్తుందని ఆశిస్తున్నాం అంటూ కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం ప్రభాస్‌ రాధే శ్యామ్.. సలార్‌ మరియు ఆదిపురుష్‌ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇదే సమయంలో ప్రాజెక్ట్‌ K కూడా పట్టాలెక్కడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాధే శ్యామ్‌ కు ఒకటి రెండు వారాల్లో గుమ్మడి కాయ కొట్టి ఆ వెంటనే సలార్‌ మరియు ఆదిపురుష్‌ ల షెడ్యూల్స్ ను కంప్లీట్‌ చేసి ఆ తర్వాత ప్రాజెక్ట్‌ K లో ప్రభాస్ జాయిన్ అవుతాడని అంటున్నారు. ప్రస్తుతం అమితాబచ్చన్‌ మరియు కీలక నటీనటులతో సినిమా షూటింగ్‌ మొదటి షెడ్యూల్‌ జరుగుతుంది. మొదటి షెడ్యూల్‌ ను వారం నుండి 10 రోజుల వరకు చేస్తారని సమాచారం. అభిమానులు ఈ సినిమాను 2022 లో రావాలని ఆశిస్తున్నారు.

సలార్‌ మరియు ఆదిపురుష్ లు 2022 లోనే రాబోతున్నాయి. కనుక ఈ ప్రాజెక్ట్‌ కూడా వచ్చే ఏడాదిలోనే వస్తే ఒకే ఏడాదిలో మూడు సినిమాలు అవి కూడా భారీ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన ఘనత ప్రభాస్ కు దక్కతుంది అనడంలో సందేహం లేదు. నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ సినిమా టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ తో రూపొందుతున్నట్లుగా చెబుతున్నారు. 2050 సంవత్సరం లో ఎలా ఉండబోతుంది.. ఆ తర్వాత పరిణామాలు ఏంటీ అనే విషయాలను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు అద్బుతమైన స్క్రీన్‌ ప్లేతో ప్లాన్‌ రాబోతున్నాడట. ప్రభాస్ కు జోడీగా దీపిక పదుకునే నటించడం ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ. కనుక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.