Begin typing your search above and press return to search.

ఏదో మిస్సవుతుందనే రీషూట్‌ -దిల్‌రాజు

By:  Tupaki Desk   |   26 May 2015 7:30 AM GMT
ఏదో మిస్సవుతుందనే రీషూట్‌ -దిల్‌రాజు
X
సాయికిరణ్‌ అడివి దర్శకత్వంలో కేరింత తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ, కథనం నుంచి నటీనటుల ఎంపిక, షూటింగ్‌ ప్రతి విషయంలో నిర్మాత దిల్‌రాజు ఎంతో మదనపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో హిట్‌ కొట్టాల్సిందేనన్న పట్టుదలతో నెలరోజుల షూటింగ్‌ అయ్యాక కూడా మళ్లీ నటీనటుల్ని మార్చి, స్క్రిప్టు మార్చి రీషూట్‌కి వెళ్లారు.

ఇంత పట్టుదలగా తెరకెక్కించిన ఈ సినిమా ఆడియో నిన్ననే రిలీజైంది. ఈ వేడుకలో దిల్‌రాజు ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. జరిగిన ఫ్యాక్ట్స్‌పై మాట్లాడుతూ.. ''స్నేహం, ప్రేమ నేపథ్యంలోని సినిమా ఇది. గతానుభవాల దృష్ట్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సొచ్చింది. ఓ మై ఫ్రెండ్‌ సినిమాలో ఒక అమ్మాయి-అబ్బాయి మధ్య ప్రేమే కాదు స్నేహం కూడా ఉంటుంది అని చెప్పడానికి ప్రయత్నిస్తే 100శాతం జనం అంగీకరించలేదు. కేరింత అలాంటి కథే అయితే బావుండదని సాయికిరణ్‌ నేను కథపై కూచుని రీరైట్‌ చేశాం.

సాయిధరమ్‌, సందీప్‌కిషన్‌, అరుణ్‌లను హీరోలుగా అనుకుని కథకు సూటవ్వరని వాళ్లకు సారీ చెప్పేశాం. ఆడిషన్‌లో సుమంత్‌ అశ్విన్‌, శ్రీదివ్యతో పాటు కొత్తవారిని ఎంచుకున్నాం. స్నేహం, ప్రేమ రెండిటిపై సినిమా ఇది. కాబట్టే ఇంత జాగ్రత్తగా సినిమా చేశాం'' అని చెప్పుకొచ్చారు.

ఇక సినిమా లేటవ్వడానికి గల కారణాలు వివరిస్తూ... ఈ సినిమా విషయంలో ఎంతో జాప్యం. 30రోజుల షూటింగ్‌ తర్వాత ఏదో అసంతృప్తి. కథలో ఏదో మిస్సవుతుందనిపించి.. మళ్లీ స్క్రిప్టుపై పనిచేసి తర్వాత 60రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశాం. సాయి చక్కగా తెరకెక్కించాడు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఒక్క సినిమా అయినా తీయాలనుకుంటున్నా'' అని చెప్పారు. హరి స్క్రీన్‌ప్లే, మిక్కీ.జె సంగీతం హైలైట్‌గా ఉంటాయని దిల్‌రాజు చెప్పారు.