Begin typing your search above and press return to search.

సుశాంత్ కి మాటిచ్చాను.. కానీ నిలబెట్టుకోలేకపోయా: క్రికెటర్ దిగ్విజయ్

By:  Tupaki Desk   |   19 Jun 2020 11:30 PM GMT
సుశాంత్ కి మాటిచ్చాను.. కానీ నిలబెట్టుకోలేకపోయా: క్రికెటర్ దిగ్విజయ్
X
బాలీవుడ్‌ టాలెంటెడ్ హీరో సుశాంత్‌ మరణం దేశవ్యాప్తంగా అందరినీ కలచివేస్తోంది. సుశాంత్ ‘కైపోచే’ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ 'కైపోచే' సినిమా క్రికెట్ నేపథ్యంలో సాగుతుంది. అయితే ఈ సినిమాలో ఇషాన్‌ అనే పాత్రలో సుశాంత్‌ నటించగా.. అలీ అనే క్రికెటర్‌ పాత్రలో మహారాష్ట్రకు చెందిన దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్‌ నటించాడు. ఈ సినిమా గురించి తాజాగా ప్రస్తావించాడు దిగ్విజయ్. ఈ సినిమా షూటింగ్‌ టైంలో దిగ్విజయ్‌ సుశాంత్‌కు ఓ మాటిచ్చినట్లు చెప్పాడు. నిజానికి సుశాంత్ అందరితోనూ కలిసిమెలిసి సరదాగా ఉంటాడు. ఆయనకు నేను షూటింగ్ అప్పుడు మాటిచ్చాను.. కానీ అది తీరలేదు అని బాధతో జరిగిన విషయం చెప్పాడు దిగ్విజయ్. ఇంకా చెప్తూ.. ‘సుశాంత్‌ క్రికెట్‌ పట్ల ఎంతో ఆసక్తి కనబర్చేవాడు. షూటింగ్‌ టైంలో నా వయసు 15 ఏళ్లు. అయినా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు.

షూటింగ్‌ తర్వాత అనేక విషయాల గురించి చర్చించేవాళ్లం. ఇక ఆరు నెలల సినీ ప్రయాణం తర్వాత కైపోచే సినిమా షూటింగ్‌ చివరి రోజు అతడికి ఓ మాటిచ్చాను. నేను మళ్లీ నిన్ను కలిసేది ఓ స్థాయి అటగాడిగా ఎదిగాకనే అని శపథం చేసి చెప్పాను. అయితే గత డిసెంబర్‌లో నిర్వహించిన ఐపీఎల్‌ వేలంలో ముంబై ఇండియన్స్‌ నన్ను తీసుకుంది. అప్పుడే అతడిని కలవాలనుకున్నా కుదరలేదు. తర్వాత కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అతడికి కలిసేందుకు అస్సలు వీలుపడలేదు. ఇప్పడు కలుద్దామనుకున్నా ఆయన లేరు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉంది. మాట నిలబెట్టుకోలేదు.. కలవలేకపోయాననే బాధ నన్ను తీవ్రంగా వేధిస్తోంది’ అంటూ దిగ్విజయ్‌ సుశాంత్ గురించి ఎమోషనల్ అయ్యాడు. ఇక తాజాగా ముంబై ఇండియన్స్‌ తమ అధికారిక ట్విటర్‌లో.. "త్వరలో దిగ్విజయ్‌ ఆటను సుశాంత్‌ పై నుంచి చూసి ఆనందిస్తాడు" అంటూ ఎమోషనల్ పోస్ట్‌ పెట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెటిజన్లను తెగ వైరల్ అవుతోంది.