Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు : బాలీవుడ్ కి శాండిల్ వుడ్ కు తేడా అదే...!

By:  Tupaki Desk   |   9 Oct 2020 2:30 AM GMT
డ్రగ్స్ కేసు : బాలీవుడ్ కి శాండిల్ వుడ్ కు తేడా అదే...!
X
సినీ ఇండస్ట్రీలో బయటపడిన డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. డ్రగ్స్ కేసులో తీగ లాగితే డొంక కదిలినట్లు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనం సృష్టించింది. ముందుగా బాలీవుడ్ లో పేలిన డ్రగ్స్ రాకెట్ బాంబ్ ప్రకంపనలు ఆ తర్వాత శాండిల్ వుడ్‌ కు టాలీవుడ్ కూ పాకాయి. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్ వ్యవహారంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు నటి రియా చక్రవర్తిని ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకునే - శ్రద్ధాకపూర్ - సారా అలీఖాన్ లతో పాటు టాలీవుడ్ హీరోయిన్ ని కూడా ఎన్సీబీ విచారించింది. మరోవైపు శాండల్‌ వుడ్‌ లో పలువురు నటీనటులకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన బెంగళూరు సిటీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో హీరోయిన్లు రాగిణి ద్వివేది - సంజన గల్రానిలను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అయితే బాలీవుడ్ డ్రగ్ కేసుకి శాండ‌ల్ వుడ్ కేసుకు తేడా ఉందని తెలుస్తోంది.

బాలీవుడ్ డ్రగ్ వ్యవహారంలో హీరోయిన్ రియా చక్రవర్తిని అరెస్ట్ చేసినా.. మరికొందరు హీరోయిన్లను విచారించినా అది వారు డ్రగ్స్ వినియోగించారనే ఆరోపణలతోనే అని తెలుస్తోంది. ఈ కేసులో ఎన్సీబీ హీరోయిన్లను విచారించినా వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న రియాకు కూడా బెయిల్ మంజూరు చేసారు. అందులోనూ ఎన్సీబీ విచారణలో చివరకు ఏమి తేల్చారనే దాని మీద కూడా స్పష్టత లేదు. అయితే శాండిల్ వుడ్ హీరోయిన్స్ రాగిణి - సంజన గల్రానిలపై డ్రగ్స్ వినియోగించారనే ఆరోపణలే కాకుండా డ్రగ్ సప్లయర్స్ గా వ్యవహరించారనే అభియోగాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రాగిణి - సంజన గల్రాని విదేశీ డ్రగ్ పెడ్లర్లతో చాటింగ్‌ చేసినట్లు సీసీబీ ఆధారాలు సేకరించిందని తెలుస్తోంది. అలానే లూమ్‌ సెప్పర్‌ నుంచి నేరుగా వీరిద్దరూ డ్రగ్స్‌ కొనుగోలు చేసి నగర శివార్లలోని జరిగే పార్టీలకు.. బెంగుళూరు పరిధిలోని రిసార్ట్స్ కి మాదక ద్రవ్యాలు సరఫరా చేసేవారని విచారణలో వెల్లడైందని కన్నడ మీడియా చెబుతోంది. అంతేకాకుండా డ్రగ్స్ అమ్మ‌కాల ద్వారా వారు భారీగా డ‌బ్బు సంపాదించారని ఈడీ అధికారులు గుర్తించారని.. సంజనకు చెందిన 11 బ్యాంక్‌ ఖాతాల నుంచి వివిధ ఖాతాలకు నగదు బదిలీ అయిన్నట్లు తెలుసుకున్నారని ప్ర‌చారం జరుగుతోంది. డ్రగ్ సప్లయర్స్ గా ఉండటం వల్లనే వారికి ఈ కేసులో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సస్ యాక్ట్ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ నిరాకరించిందని ప్ర‌చారం సాగుతోంది.