Begin typing your search above and press return to search.

హీరోను కలిశాడు ప్రాణం వదిలేశాడు

By:  Tupaki Desk   |   7 March 2017 8:05 AM GMT
హీరోను కలిశాడు ప్రాణం వదిలేశాడు
X
బలహీనమైన గుండెలు బాధ ఎక్కువైనా తట్టుకోలేవు. సంతోషం ఎక్కువైనా తట్టుకోలేవు. టీమ్ ఇండియా ఏదైనా కీలకమైన మ్యాచ్ గెలిచినపుడు అభిమానుల గుండెలు ఆగిపోవడం గురించి చాలాసార్లు విన్నాం. తాజాగా కర్ణాటకకు చెందిన ఒక అభిమాని.. తన అభిమాన కథానాయకుడిని కలుసుకున్న ఆనందంలో ప్రాణం వదిలేశాడు. ఈ విషాదకర ఘటన కర్ణాటక జిల్లాలోని తుముకూరులో చోటు చేసుకుంది.

కర్ణాటకలో సూపర్ స్టార్ అయిన సుదీప్.. ఈ మధ్యే ‘హెబ్బులి’ అనే సినిమాతో హిట్టు కొట్టాడు. ఆ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తున్న నేపథ్యంలో విజయయాత్రలో భాగంగా తుముకూరుకు చేరుకున్నాడు సుదీప్. అతణ్ని చూసేందుకు వేలాది మంది అభిమానులు గుమిగూడారు. అందులో 45 ఏళ్ల శశిధర్ కూడా ఉన్నాడు. అతడికి సుదీప్ ను కలిసి అతణ్ని హగ్ చేసుకునే అవకాశం కూడా దక్కింది.

ఐతే అది జరిగిన కాసేపటికే అతడికి గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణం పోయింది. తన అభిమాన కథానాయకుడిని కలిసి హత్తుకున్న నేపథ్యంలో శశిధర్ తీవ్ర భావోద్వేగానికి లోనవడం వల్లే గుండెపోటు వచ్చిందని భావిస్తున్నారు. ఈ ఘటన పట్ల సుదీప్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శశిధర్ మరణంతో తుముకూరులో విషాద ఛాయలు నెలకొన్నాయి. అభిమానులు శశిధర్ కు ఘన నివాళి అర్పించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/