Begin typing your search above and press return to search.

పూరితో పాటు కృష్ణ‌వంశికీ అదే జ‌రిగిందా?

By:  Tupaki Desk   |   18 Nov 2022 11:30 PM GMT
పూరితో పాటు కృష్ణ‌వంశికీ అదే జ‌రిగిందా?
X
టాలీవుడ్ లో వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ గా, అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేయ‌గ‌ల ద‌ర్శ‌కుడిగా పూరి జ‌గ‌న్నాథ్ కు మంచి పేరుంది. త‌న సినిమాల్లో హీరోని ప్ర‌త్యేకంగా చూపిస్తూ ప్ర‌త్యేక‌త‌ను చాటుక‌న్నారు. ఇలాంటి డైరెక్ట‌ర్ తో క‌లిసి ప‌ని చేయాల‌ని ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోలు భావించే వారు. అయితే ఎప్ప‌టికైనా చిరుతో ఓ సినిమా చేయాల‌నేది పూరి డ్రీమ్‌. ఆ డ్రీమ్ తో మెగాస్టార్ చిరంజీవి కోసం పూరి జ‌గ‌న్నాథ్ 'ఆటో జానీ' అనే స్టోరీని సిద్ధం చేశాడు. చిరుకి వినిపించాడు.

కానీ అది చిరుకు ఏమాత్రం న‌చ్చ‌లేదు. భారీ మార్పులు చెప్ప‌డంతో ఆ ప్రాజెక్ట్ ని ఆ త‌రువాత పూరి ప‌క్క‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఇలాంటి అనుభ‌వ‌మే క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ వంశికీ ఎదురైంద‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా కృష్ణవంశీ ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించి షాకిచ్చాడు. వివ‌రాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దేశ భ‌క్తి ప్ర‌ధానంగా సాగే ఓ సినిమా చేయాల‌నుకున్నార‌ట‌. దానికి 'వందేమాత‌రం' అని టైటిల్ ని కూడా అనుకున్నార‌ట‌.

చిరుకు క‌థ చెప్పార‌ట‌. అయితే అది కార్య‌రూపం దాల్చ‌లేద‌ని, అందుకు కాలం స‌హ‌క‌రించ‌లేద‌ని, భ‌విష్య‌త్తులో చిరుని డైరెక్ట్ చేసే అవ‌కాశం ల‌భిస్తుంద‌న్న ఆశ త‌న‌కు లేద‌ని కృష్ణ వంశీ చెప్ప‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ప్ర‌స్తుతం చిరు వున్న ప‌రిస్థితిలో కృష్ణ‌వంశీకే కాదు పూరి జ‌గ‌న్నాథ్ కు కూడా ఛాన్స్ ఇవ్వ‌డం క‌ష్ట‌మే. చిరంజీవి ప‌దేళ్ల విరామం త‌రువాత 'ఖైదీ నంబ‌ర్ 150'తో రీఎంట్రీ ఇచ్చినా ఆ స్థాయిలో స‌క్సెస్ ని సొంతం చేసుకోలేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

రీసెంట్ గాచేసిన 'ఆచార్య‌, గాడ్ ఫాద‌ర్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే కృష్ణవంశీ మ‌రో విష‌యాన్ని కూడా ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు. మెగాస్టార్ తో పాటు నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌తో సినిమాలు చేయాల‌ని వారి కోసం క‌థ‌ల‌కు కూడా సిద్ధం చేశార‌ట‌. అయితే అవి కార్య‌రూపం దాల్చ‌లేద‌ని చెప్పుకొచ్చారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌తో కృష్ణ వంశీ 'రైతు' పేరుతో భారీ మూవీకి శ్రీ‌కారం చుట్టాల‌నుకున్నారు.

అందులోని కీల‌క పాత్ర కోసం అమితాబ్ బ‌చ్చ‌న్ ని సంప్ర‌దించారు. అయితే ఆ ప్రాజెక్ట్ కు వ‌ర్మ అడ్డుప‌డ్డారో.. అమితాబ్ కు ఇష్టం లేదో తెలియ‌దు కానీ అమితాబ్ బ‌చ్చ‌న్ న‌టించ‌డానికి అంగీక‌రించ‌క‌పోవ‌డంతో కృష్ణ‌వంశీ - బ‌ల‌య్య‌ల 'రైతు' ప్రాజెక్ట్ ఆగిపోయింది. అమితాబ్ చేస్తేనే సినిమా చేస్తాన‌ని కృష్ణ‌వంశీ భీష్మించుకోవ‌డంతో ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌లేక‌పోయింది. అది ఇప్ప‌టికి కూడా కార్య‌రూపం దాల్చ‌డం క‌ష్ట‌మే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.