Begin typing your search above and press return to search.

'వాల్తేరు వీరయ్య' టీజర్ లో మెగా ఫ్యాన్స్ ని నిరుత్సాహ పరిచింది అదొక్కటే..!

By:  Tupaki Desk   |   25 Oct 2022 5:39 AM GMT
వాల్తేరు వీరయ్య టీజర్ లో మెగా ఫ్యాన్స్ ని నిరుత్సాహ పరిచింది అదొక్కటే..!
X
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''వాల్తేరు వీరయ్య''. దీపావళి సందర్భంగా మెగా154 మేకర్స్ టైటిల్ ను అధికారికంగా ప్రకటించడంతో పాటుగా టైటిల్ టీజర్ ను ఆవిష్కరించారు.

'వాల్తేరు వీరయ్య' టైటిల్ టీజర్ కి అభిమానులు మరియు సాధారణ ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఊర మాస్ అవతార్ లో చిరు అందరినీ సర్ప్రైజ్ చేశారు. అప్పుడెప్పుడో 'ముఠామేస్త్రీ' 'అందరివాడు' సినిమాలలో మాదిరిగా కనిపించి ఆకట్టుకున్నాడు.

టీజర్ చూసిన తర్వాత వింటేజ్ చిరంజీవి ఈజ్ బ్యాక్ అంటూ మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అయితే 'వాల్తేరు వీరయ్య' టైటిల్ వీడియో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారని తెలుస్తోంది.

మెగాస్టార్ 154వ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. టీజర్ కు డీఎస్పీ అందించిన మ్యూజిక్ లో కొత్తదనం లేదని.. సాధారణ బీజీఎంతో నిరాశపరుస్తారని ఊహించలేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

మరికొందరు నేపథ్య సంగీతం కొన్ని తమిళ చిత్రాల బీజీఎంల మిక్సింగ్ గా ఉందని అంటున్నారు. గతంలో చిరంజీవి సినిమాలకు దేవి అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ స్థాయిలో ఇది లేదని అభిప్రాయ పడుతున్నారు.

ఇటీవల కాలంలో బ్యాగ్రౌండ్ స్కోర్ అనేది సినిమా ఫలితంలో చాలా కీలకంగా మారిందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం BGM కారణంగా హిట్టయిన సినిమాలు చాలానే ఉన్నాయి.

మరోవైపు ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాలను తదుపరి స్థాయికి తీసుకెళ్తున్న నేపథ్యంలో.. దేవిశ్రీప్రసాద్ మీద కాస్త ఒత్తిడి ఉందనేది వాస్తవం. అందులోనూ ఇది చిరంజీవి చాలా కాలం తర్వాత నటిస్తున్న ఒరిజినల్ సినిమా కావడంతో అంచనాలు నెలకొన్నాయి.

'వాల్టేర్ వీరయ్య' సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ నుంచి అబ్బురపరిచే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఆశిస్తున్నారు. అయితే ఇప్పుడు టైటిల్ టీజర్ లో బీజీఎంకు మిశ్రమ స్పందన రావడంతో నిరాశ చెందుతున్నారు.

అయితే ఇది కేవలం టైటిల్ టీజర్ మాత్రమే అని.. నిర్ణీత వ్యవధిలో కంపోజ్ చేసిన బీజీఎం అని అందరూ గమనించాలి. చిన్న వీడియోకి అందించిన సంగీతంతో జడ్జిమెంట్ ఇచ్చేయడం సరైనది కాదు. గతంలో చిరు కి అనేక చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందించాడు దేవి.

ఇప్పుడు 'వాల్తేరు వీరయ్య' సినిమాకు కూడా దేవిశ్రీ అద్భుతమైన పాటలు మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ అందించడానికి కృషి చేస్తున్నారు. కచ్చితంగా అభిమానులకు పూనకాలు తెప్పిస్తారని చిత్ర బృందం ధీమాగా ఉంది. 'పుష్ప' తర్వాత డీఎస్పీ మళ్ళీ అందరూ తన సంగీతం గురించి మాట్లాడుకునేలా చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

'వాల్తేరు వీరయ్య' సినిమాను 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో చిరంజీవి తో పాటుగా మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందే ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శృతి హాసన్ - క్యాథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.