Begin typing your search above and press return to search.

'దేవి' సినిమా షూటింగులో నిజంగానే ఆమెను పాము కరిచిందట!

By:  Tupaki Desk   |   18 Aug 2021 3:30 AM GMT
దేవి సినిమా షూటింగులో నిజంగానే ఆమెను పాము కరిచిందట!
X
తెలుగులో అలనాటి అందాల కథానాయికగా 'మంజుల' ఒక వెలుగు వెలిగారు. అప్పటి అగ్రకథానాయకులతో భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. అలాంటి మంజుల .. విజయ్ కుమార్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ దంపతుల మొదటి కూతురే వనిత. తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన 'దేవి' సినిమాలో ఆమె నటించారు. ఆ తరువాత సినిమాలపై పెద్దగా ఆసక్తిని చూపలేదు. అలాంటి వనిత తాజాగా 'ఆలీతో సరదాగా' వేదిక ద్వారా 'దేవి' సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటనను గురించి చెప్పుకొచ్చారు.

"కోడి రామకృష్ణగారి దర్శకత్వంలో ఎమ్మెస్ రాజుగారు 'దేవి' సినిమాను మొదలుపెట్టారు. ఆ సినిమా షూటింగు అనుకున్నట్టుగానే చాలా బాగా జరుగుతోంది. వైజాగ్ లో ఓ రోజున నాపై ఒక సీన్ ను చిత్రీకరించారు. ఆ సీన్లో నేను పాము పుట్టలో పాలు పోసినప్పుడు పాము వచ్చి నాకు బొట్టు పెడుతుంది. ఆ సమయంలో ఒక డివోషనల్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. పాము బొట్టు పెట్టడం చూసినవాళ్లు అది గ్రాఫిక్స్ అనుకుంటారు .. కానీ నిజమైన పాముతోనే నాకు కుంకుమ బొట్టు పెట్టించారు. అలా బొట్టు పెట్టిన పాము నా చేతిపై కాటువేసింది.

పాము కరిచిన చోట బ్లడ్ వచ్చింది. అది చూసి అంతా చాలా కంగారుపడుతున్నారు. నిర్మాత రాజుగారు చాలా టెన్షన్ పడుతున్నారు. వెంటనే ఏదో మెడిసిన్ తెప్పిస్తే .. 'నాటుమందు వాడవద్దు' అని మా ఆమె ఆ మందును వాడనీయలేదు. ఎమ్మెస్ రాజుగారు ఎంతగా చెప్పినా ఆమె వినిపించుకోలేదు. 'నా కూతురు నాగదేవత అనుగ్రహం వల్లనే పుట్టింది .. చనిపోయినా ఆ దేవత వల్లనే చనిపోయిందనుకుంటాను' అంది. నేను కూడా ఆ పామును పాముగా చూడలేదు .. ఒక దేవతగానే చూస్తూ వచ్చాను .. అందువలన ధైర్యంగానే ఉన్నాను.

నాగదేవత అనుగ్రహం వలన నాకు ఏమీ జరగలేదు. అదే స్పాట్ లో అదే పాముతో మరో సీన్ చేశాను. ఆ పాము నా మీదుగా వచ్చి వెళ్లాలి. ఆ సీన్ ను చిత్రీకరించేటప్పుడు ఆ పాము తెచ్చిన వ్యక్తి దానికి వెనుక వైపున దగ్గరగా కూర్చున్నాడు. ఆ పాము నా మీదుగా వచ్చి వెళ్లింది. అలా వెనక్కి తిరిగిన పాము అతణ్ణి కాటు వేసింది. వెంటనే అతణ్ణి దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం షూటింగ్ క్యాన్సిల్ అని చెప్పేసి నాకు కాల్ వచ్చింది. ఎందుకని అడిగితే ఆ వ్యక్తి చనిపోయాడని చెప్పారు. ఇది నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సంఘటన" అని చెప్పుకొచ్చారు.