Begin typing your search above and press return to search.

సాయితేజ్ ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చిన దేవ కట్టా!

By:  Tupaki Desk   |   29 Sep 2021 4:30 AM GMT
సాయితేజ్ ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చిన దేవ కట్టా!
X
సాయితేజ్ హీరోగా దర్శకుడు దేవ కట్టా 'రిపబ్లిక్' సినిమా చేశాడు. భగవాన్ - పుల్లారావు నిర్మించిన ఈ సినిమాను, అక్టోబర్ 1వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా ఈవెంట్ కొనసాగింది. ఈ వేదికపై పవన్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. సాయితేజ్ గురించి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడుతూ ఉంటే, కథనాలు అల్లుతూ ఉంటే అక్కడ అతను ఇంకా కళ్లు తెరవకుండా అలాగే పడివున్నాడు అంటూ ఆవేదన చెందారు.

దాంతో ఆ మరుసటి రోజు .. సాయితేజ్ ఇంకా 'కోమా'లో నుంచి బయటికి రాలేదు అనే ఒక ప్రచారం మొదలైంది. ఆయన ఇంకా కోలుకోలేదు అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. అందువల్లనే పవన్ అలా మాట్లాడాడు అనే టాక్ జోరందుకుంది. దాంతో మెగా అభిమానూలు ఆందోళన చెందారు. నిజంగానే సాయితేజ్ ఇంకా కోలుకోలేదా? ఆయన కోమాలోనే ఉన్నాడా? అనే సందేహాలు వారిలో తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు ఈ సినిమా దర్శకుడు దేవ కట్టాను అడిగారట.

అందుకు దేవ కట్టా స్పందిస్తూ .. సాయితేజ్ చాలా వేగంగా కోలుకుంటున్నాడు. ఆయన ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాడు .. ఫుడ్ తీసుకుంటున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా సాయితేజ్ హాస్పిటల్లో చూశాడు. తాను కోరుకున్నట్టుగానే ఈ సినిమాను అక్టోబర్ 1వ తేదీన విడుదల చేస్తున్నందుకు ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఆయన విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదు" అని చెప్పుకొచ్చాడు. 'అంతా ఓకే అనుకున్నప్పుడు సాయితేజ్ ను ఎందుకు బయటికి తీసుకురావడం లేదు' అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.

సాయితేజ్ కి జరిగింది పెద్ద ప్రమాదమే అయినప్పటికీ, లక్కీగా ఆయన బయటపడ్డాడు. చిన్నపాటి సర్జరీలు కూడా జరిగాయి. అందువలన బయట ఉన్న పరిస్థితులు .. ఇన్ఫెక్షన్లు ఎటాక్ కాకూడదనే ఉద్దేశంతోనే ఆయనను ప్రస్తుతానికి బయటికి తీసుకురావడం లేదు. త్వరలోనే ఆయన బయటికి వస్తాడు. ఆయన చేసిన ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఈ సినిమాలో ఆయన చేసిన కొన్ని సీన్స్ చూసి మీరు షాక్ అవుతారు" అంటూ దేవ కట్టా చెప్పుకొచ్చాడు.

పవన్ కల్యాణ్ మాటల కారణంగా సాయితేజ్ పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉందని ఆందోళన చెందిన ఆయన అభిమానులు, దేవ కట్టా ఇచ్చిన క్లారిటీతో తేలికగా ఊపిరి పీల్చుకున్నారు. ఇది రాజకీయాల చుట్టూ తిరిగే కథ .. అవినీతి రాజకీయ నాయకులు ఆడే ఆటలో సామాన్యులు నలిగిపోయే కథ. అలాంటి ఈ కథలో ఒక పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. ఆమెకి .. సాయితేజ్ కి మధ్య నడిచే సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని అంటున్నారు.