Begin typing your search above and press return to search.

ఆ రెండు ప్లాప్ లు నేను చేసినవి కాదు

By:  Tupaki Desk   |   30 Sep 2021 1:30 AM GMT
ఆ రెండు ప్లాప్ లు నేను చేసినవి కాదు
X
'వెన్నెల' సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు దేవ కట్టా. ఆ సినిమా మంచి కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌ గా నిలిచి సక్సెస్ ను దక్కించుకుంది. మొదటి సినిమా తర్వాత దాదాపు అయిదు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న దర్శకుడు దేవ కట్టా 2010 సంవత్సరంలో ప్రస్థానం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఎన్నో అవార్డులు రివార్డులు దక్కించుకుంది. అయితే సినిమా కమర్షియల్‌ గా మాత్రం ఆడలేదు. కమర్షియల్‌ ఎలిమెంట్స్ లేక పోవడం వల్లే ప్రస్థానవం వంటి మంచి సినిమాకు వసూళ్లు రాలేదు అంటూ చాలా మంది అనుకున్నారు. ప్రస్థానం సినిమాను కాస్త కమర్షియల్ యాంగిల్‌ లో తీసి ఉంటే ఖచ్చితంగా దర్శకుడు ఇప్పుడు టాప్‌ లో ఉండేవాడు అంటూ అప్పట్లో చాలా మంది అనుకున్నారు. అందుకే ఆయన తదుపరి సినిమా విషయంలో కమర్షియల్‌ ఎలిమెంట్స్ ను జొప్పించేలా ఆయన్ను చాలా మంది ప్రేరేపించారు. ప్రస్థానం తర్వాత నాలుగు ఏళ్లకు ఆటోనగర్ సూర్య సినిమాతో దేవ కట్టా వచ్చాడు. నాగ చైతన్య హీరోగా నటించిన ఆ సినిమా కొన్ని కారణాల వల్ల చాలా ఆలస్యం అయ్యింది. దానికి తోడు ఒక సీరియస్ స్టోరీకి సిల్లీ కామెడీ జోడించే ప్రయత్నం చేయడంతో సినిమా మొదటికే మోసం వచ్చినట్లుగా ప్లాప్‌ అయ్యింది.

ఆటో నగర్ సూర్య సినిమా ఇతరుల ప్రేరణ తో తీసింది అని.. తాను ఇతరులు బలవంతం చేయడం వల్ల కామెడీని పెట్టాల్సి వచ్చిందని దేవ కట్టా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తన ఐడియా ప్రకారం ఆ సినిమాను చేయలేదు అంటూ నిర్మొహమాటంగా చెప్పేశాడు. ఆ తర్వాత చేసిన సినిమా కూడా తన ప్రమేయం లేకుండా పూర్తి అయ్యిందని అన్నాడు. మంచు విష్ణు హీరోగా నటించిన డైనమైట్ కు దేవ కట్టా దర్శకత్వం అంటూ టైటిల్‌ కార్డ్‌ వేశారు. తమిళ మూవీకి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. దేవ కట్టాకు రీమేక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ అప్పట్లో కొందరు కామెంట్స్ చేశారు. తాజాగా ఆ విషయం గురించి రిపబ్లిక్ మూవీ ప్రమోషన్ సందర్బంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. డైనమైట్‌ సినిమాకు నేను వర్క్ చేసింది కేవలం 8 రోజులు మాత్రమే. షూటింగ్‌ స్పాట్‌ కు వెళ్లింది నేను 8 రోజులే. మిగిలినది అంతా కూడా వాళ్ల ఇష్టం ప్రకారం.. ఇష్టం ఉన్న వారితో చేయించుకున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఆ సినిమా ను ముగించేశారు. ఆ సినిమాలో నా ప్రమేయం తక్కువ అని చెప్పాలి. అమెరికా నుండి నేను ఇండియా వచ్చిన సమయంలో చాలా ప్రస్టేషన్ లో ఉన్నాను. ఆ సమయంలో డైనమైట్‌ గురించిన ఆఫర్ వచ్చింది.

ఆ సమయంలో ఏం చేస్తున్నాను అనే విషయాన్ని పట్టించుకోకుండా ఆ సినిమాకు కమిట్‌ అయ్యాను. కాని ఆ సినిమా చిత్రీకరణ సమయంలో నాతో పట్టింపు లేకుండానే సినిమాను ముగించారు. ఆ సమయంలో నేను కూడా ఏమనలేక పోయాను అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాని రిపబ్లిక్ విషయంలో మాత్రం ఏ ఒక్కరి సలహాలు లేవు.. ఏ ఒక్కరి ఇన్వాల్వ్‌ మెంట్ లేదు. పూర్తిగా నా సొంత నిర్ణయాలతో సినిమాను ముగించాను. సాయి ధరమ్‌ తేజ్ నాకు ఒక సైనికుడిగా వెనుకుండి రిపబ్లిక్ ను నడిపించాడు. ఆయన నేను చెప్పినది చెప్పినట్లుగా చేసి కథపై తనకు ఉన్న నమ్మకంతో పూర్తి బాధ్యతను నాపై వదిలేశాడు. అందుకే రిపబ్లిక్ ఒక మంచి సినిమా వచ్చిందనే నమ్మకంను ఆయన వ్యక్తం చేశాడు. అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో సాయి ధరమ్‌ తేజ్ కు జోడీగా ఐశ్వర్య రాజేష్‌ నటించింది. రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించింది.