Begin typing your search above and press return to search.

విలన్ గా విఖ్యాత దర్శకుడి కొడుకు

By:  Tupaki Desk   |   9 Sep 2017 6:00 AM GMT
విలన్ గా విఖ్యాత దర్శకుడి కొడుకు
X
విఖ్యాత దర్శకుడు దాసరి నారాయణరావు ఎందరో నటులకు లైఫ్ నిచ్చారు. ఆయన పరిచయం చేసిన ఎంతో మంది హీరోలు.. గొప్ప నటులు అయ్యారు. కానీ అదేం చిత్రమో ఆయన సొంత కుమారుడిని హీరోగా నిలబెట్టాలని ఎంతో ప్రయత్నించారు. కానీ సక్సెస్ కాలేకపోయారు. దాసరి కుమారుడు అరుణ్ కుమార్ గ్రీకువీరుడు సినిమాతో హీరోగా రంగ ప్రవేశం చేశాడు. అందులో బాలీవుడ్ సుందరి పూజా బాత్రా హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఆ తర్వాత అరుణ్ కుమార్ నాలుగైదు సినిమాలు చేసినా అవేవీ హిట్టవలేదు. ఇండస్ట్రీలో అతడికి చెప్పుకోదగ్గ గుర్తింపూ రాలేదు.

అరుణ్ కుమార్ ప్రేక్షకులకు బాగా నోట్ అయింది అంత:పురం సినిమాలో స్పెషల్ సాంగ్ తో. అందులో సై సిందెయ్.. శివమెత్తర సాంబయ్య అంటూ సాగే పాటలో అరుణ్ డ్యాన్స్ తో ఊపు తెస్తాడు. అంతకుమించి అతడి కెరీర్ లో చెప్పుకోదగిన విజయాలేం లేవు. ఇప్పుడు ట్రెండ్ మార్చి విలన్ పాత్రలపై దృష్టి పెట్టాడు. అల్లు శిరీష్ లేటెస్ట్ ఫిలింలో అరుణ్ కుమార్ విలన్ గా కనిపించబోతున్నాడనేది లేటెస్ట్ న్యూస్. రీసెంట్ గా నిఖిల్ హీరోగా నటించి మంచి విజయం సాధించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ దీనికి దర్శకుడు. తెలుగులో విలన్ పాత్రలకు సరైన నటులు తక్కువగానే ఉన్న పరిస్థితుల్లో అరుణ్ కుమార్ ఈ పాత్రలో రాణిస్తే చక్కగా విలన్ గా సెటిలై నటుడిగా చూడాలన్న తండ్రి కోరిక నెరవేర్చవచ్చు.

సినిమా ఇండస్ట్రీ వారసులకు వెల్ కమ్ చెప్పడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటుంది. లాంచింగ్ కోసం వారసత్వం ఉపయోగపడినా ఆ తర్వాత క్లిక్ అవడానికి టాలెంట్ తో పాటు కాస్తంత లక్ కూడా ఉండాలి. లేకపోతే ఎన్నాళ్లు ప్రయత్నించినా పెద్దగా ఫలితం ఉండదు. ఇంతకుముందు నందమూరి ఫ్యామిలీలో తారకరత్న చాలా సినిమాల్లో హీరోగా నటించాడు. సరైన హిట్ లేక చివరకు రవిబాబు డైరెక్షన్ లో అమరావతి అనే సినిమాలో విలన్ రోల్ చేశాడు. అఫ్ కోర్స్... ఆ ఐడియా పెద్దగా వర్కవుట్ అవలేదు. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని దాసరి అరుణ్ కుమార్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బెటర్.