Begin typing your search above and press return to search.

ఆన్ లైన్ టికెటింగ్ వల్ల నష్టం ఎవరికో తెలుసా ?

By:  Tupaki Desk   |   29 Sep 2021 2:30 PM GMT
ఆన్ లైన్ టికెటింగ్ వల్ల నష్టం ఎవరికో తెలుసా ?
X
ప్రభుత్వమే ఆన్ లైన్లో సినిమాటికెట్లు అమ్మాలనే ప్రతిపాదన ఇపుడు పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. ఈ ప్రతిపాదనపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం ఏదైనా మంచి-చెడ్డాపై చర్చించుకోవటం, భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవటం చాలా మంచిదే. అయితే సినిపరిశ్రమలోని మెజారిటి వర్గాలు ప్రభుత్వమే ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకాన్ని స్వాగతిస్తున్నాయి. దీనివల్ల పారదర్శకత వస్తుందన్నది మెజారిటి వర్గాల అభిప్రాయం.

ఆన్ లైన్ విధానం వల్ల ప్రధానంగా మూడు లాభాలున్నాయట. అవేమిటంటే టికెట్లు బ్లాకులో అమ్మకాలు ఆగిపోతాయి. రెండోది ఎన్ని టికెట్లు అమ్ముడుపోతున్నాయో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు లెక్కలు తెలిసిపోతాయి. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ బాగా పెరుగుతుంది. ఎగ్జిబిటర్లు తమిష్టం వచ్చినట్లు టికెట్ ధరలను పెంచేసి అమ్ముకునేందుకు లేదు. అంతిమంగా సినీ జనాల సంగతి ఎలాగున్నా టికెట్ కొని సినిమా చూసే ప్రేక్షకులు హ్యాపీ.

ఆన్ లైన్ అమ్మకాలు అమల్లోకి వస్తే ఇంకా ఏవైనా లాభాలుంటే అవికూడా అర్ధమవుతుంది. ఇదే సమయంలో నష్టాలు కూడా కొన్నున్నాయి. అవేమిటంటే ప్రధానంగా రెమ్యునరేషన్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఉదాహరణకు ఒక టాప్ హీరో రు. 50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని అనుకుందాం. హీరోకే 50 కోట్ల రూపాయలిచ్చేటపుడు అదే స్ధాయిలో డైరెక్టర్ ను తీసుకోవాలి. అంటే టాప్ డైరెక్టర్ కు కూడా నిర్మాత ఇంకో రు. 10-15 కోట్లు ఇచ్చుకోవాలి.

ఈ లెక్కన సినిమా బడ్జెట్ ఎంత తక్కువేసుకున్నా రు. 150 కోట్లయిపోతుంది. మరింత భారీ ఎత్తున సినిమా తీసిన నిర్మాతకు లాభాలు రావాలంటే ఎన్ని అవస్తలు పడాలి. అందుకనే సినిమా రిలీజ్ నుండి మొదటివారం తనిష్టం వచ్చినట్లు టికెట్ ధరలను పెంచేసుకుంటాడు నిర్మాత. మొన్నటి వరకు ఇదే అమల్లో ఉంది. కొన్ని సినిమాలకు అభిమానులు వెయ్యి రూపాయలు పెట్టి టికెట్ కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. మామూలుగా థియేటర్లో ఉండే టికెట్ ధరలకు ఈ ధరలకు ఎలాంటి సంబంధం ఉండదు.

ఈ విధంగా టికెట్ల ధరలను తమిష్టం వచ్చినట్లు నిర్ణయించుకుని అమ్ముకుంటునే తాము పెట్టిన బడ్జెట్ తిరిగొస్తుంది. ఒకవేళ టికెట్ ధరలను పెంచటం సాధ్యంకాకపోతే నిర్మాత ఏమి చేస్తారు ? రెమ్యునరేషన్ను తగ్గించుకోమని హీరో, డైరెక్టర్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్లను అడుగుతారు. వాళ్ళు తగ్గించుకోకపోతే ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళను చూసుకుంటారు. అంటే సెకెండ్ గ్రేడ్ వాళ్ళకో లేకపోతే కొత్తవాళ్ళకో అవకాశాలు వస్తాయి. ఒకరిద్దరు నిర్మాతలు ఇలా చేస్తే మిగిలిన నిర్మాతలు కూడా ఇదే దారిలో నడుస్తారు.

దీనివల్ల ఏమవుతుందంటే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న వాళ్ళందరి మీద దెబ్బపడిపోతుంది. సినిమాలు చేయాలంటే తమ రెమ్యునరేషన్ తగ్గించుకోక తప్పని పరిస్ధితి. లేకపోతే సొంతంగానే సినిమాలు చేసుకోవాలి. ఆన్ లైన్ విధానం వల్ల ఏమవుతుందంటే అంతిమంగా సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత ? ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్సులెంత అన్నది పక్కాగా లెక్కలు తేలిపోతాయి. దీనివల్ల ట్యాక్సులు ఎగ్గొట్టే అవకాశంలేదు, కలెక్షన్లపై కాకిలెక్కలు చెప్పేందుకూ లేదు. ఇందుకనే కొందరు ఆన్ లైన్లో టికెట్ల అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నారు.