Begin typing your search above and press return to search.

వ‌ర్మ‌కు షాక్‌..సైబ‌ర్ క్రైమ్ కీల‌క నోటీసులు

By:  Tupaki Desk   |   15 Dec 2019 5:28 PM GMT
వ‌ర్మ‌కు షాక్‌..సైబ‌ర్ క్రైమ్ కీల‌క నోటీసులు
X
`అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు` సినిమా మొద‌లుపెట్టిన నాటి నుంచి....నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న‌ దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. అనేక అవాంతరాల అనంతరం ఈ సినిమా డిసెంబరు 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే * సినిమా విడుద‌లైన‌ప్ప‌టికీ...వర్మపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ త‌న వాద‌న‌ను వినిపిస్తున్నారు. తాజాగా ఆయ‌న మ‌రో అడుగు ముందుకు వేసి సీసీఎస్ పోలీసుల‌కు చేసిన ఫిర్యాదుతో వ‌ర్మ‌కు నోటీసులు అందాయి. ప్ర‌చారం నిజ‌మైతే...ఆయ‌న పోలీసుల ముందు హాజ‌రుకానున్నారు.

‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలో పాత్ర‌తో త‌మ‌ను కించ‌ప‌రుస్తున్న‌ట్లు పాల్‌ అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తుండ‌గా...తాజాగా పాల్ కోడ‌లు జ్యోతి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. తమ అనుమతి లేకుండా ఫొటోలను మార్ఫింగ్‌ చేయడమే కాకుండా ఇష్టానుసారం తమపై ప్రచారం చేస్తున్నార‌ని - ఈ నేప‌థ్యంలో వర్మపై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ సైబర్ క్రైమ్స్‌ ను ఆమె ఆశ్ర‌యించారు. దీంతో పోలీసులు నోటీసులు అందించారు.

కేఏ పాల్ కోడ‌లు ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వర్మకు నోటీసులు ఇచ్చారు. సోమ‌వారం సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. సోమ‌వారం ఉదయం సైబర్ క్రైమ్ పోలీసులు ముందుకు వర్మ రానున్న‌ట్లు స‌మాచారం. అయితే, దీనిపై ఇప్ప‌టివ‌ర‌కు వ‌ర్మ స్పందించ‌లేదు. వ‌ర్మ హాజ‌ర‌వుతారా? పోలీసుల‌కు ఏమ‌ని స‌మాధానం ఇవ్వ‌నున్నార‌నే ఆస‌క్తి నెల‌కొంది.