Begin typing your search above and press return to search.

'రాధేశ్యాం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూలిన కటౌట్..

By:  Tupaki Desk   |   24 Dec 2021 3:53 AM GMT
రాధేశ్యాం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూలిన కటౌట్..
X
అట్టహాసంగా నిర్వహించిన డార్లింగ్ ప్రభాస్ ‘రాధేశ్యాం’ చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్ ను రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ప్రమాదంలో ప్రభాస్ అభిమానులు ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. ప్రీరిలీజ్ ఫంక్షన్ కు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు భారీగా తరలి వచ్చారు.

దీంతో.. రామోజీ ఫిలిం సిటీ వద్ద అభిమానులతో ట్రాఫిక్ జాం చోటు చేసుకుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ ఫంక్షన్ నేపథ్యంలో భారీ ఎత్తున కటౌట్ ను ఏర్పాటు చేశారు. దీనిపై 40 మంది అభిమానులు ఎక్కారు. నిర్వాహకులు ఎంత కోరినా వారు కిందకు దిగలేదు. అభిమానుల బరువుకు కటౌట్ కూలింది. దీంతో.. కటౌట్ మీద నుంచి కింద పడటంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

తమ అభిమాన హీరో చిత్ర ప్రీరిలీజ్ ఫంక్షన్ కావటంతో పెద్ద ఎత్తున హాజరైన అభిమానులు.. అత్యుత్సాహంతో వ్యవహరించటం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. ఒకదశలో ఫ్యాన్స్ ను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జి చేయాల్సి వచ్చింది. ఈ ప్రమాదం డార్లింగ్ అభిమానులతో పాటు.. చిత్ర యూనిట్ కు షాకిచ్చేలా మారింది.