Begin typing your search above and press return to search.

బయట వాన.. బిగ్ బాస్ హౌస్ లో ఏడుపు వరద

By:  Tupaki Desk   |   3 Aug 2019 6:30 AM GMT
బయట వాన.. బిగ్ బాస్ హౌస్ లో ఏడుపు వరద
X
బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభానికి ముందు నుంచే వివాదాలతో ఈ షో మీద అందరి కన్ను పడేలా మారింది. పోలీసు కేసులు.. విచారణలు.. ఫిర్యాదులు.. నిందలు.. ఆరోపణలు.. విమర్శలు ఇలా సాగుతున్న బిగ్ బాస్ హౌస్ లోనూ అలాంటి పరిస్థితే. ఒకరిపై ఒకరు మాటలు అనుకోవటం.. చెలరేగిపోవటం.. తిట్టుకోవటాలు.. కొట్టుకునే వరకూ వెళ్లిన గొడవలతో.. హౌస్ లో ఏ రోజు ఎలాంటి వివాదం తెర మీదకు వస్తుందో అర్థం కాని పరిస్థితి.

ఇలాంటి సీన్ కు భిన్నమైన సీన్ శుక్రవారం ఎపిసోడ్ లో కనిపించింది. బిగ్ బాస్ ఇచ్చిన ఒక టాస్క్ తో హౌస్ వాతావరణం ఒక్కసారిగా మారిపోవటమే కాదు.. ఎపిసోడ్ మొత్తం ఏడుపు వరద పారించారు. బయట కురుస్తున్న విస్తారమైన వర్షాలకు తగ్గట్లే బిగ్ బాస్ హౌస్ లోపల కూడా ఏడుపు ప్రవాహంగా మారింది. హౌస్ మేట్స్ పలువురు నాన్ స్టాప్ గా కన్నీళ్లు కార్చేశారు. ఎందుకిలాంటి పరిస్థితి అంటే.. తమ జీవితాల్లో జరిగిన ఉదంతాలు.. మళ్లీ ఎప్పటికి జరగకూడదని కోరుకునే భావోద్వేగ సందర్భాల్ని గుర్తు చేసుకోవాలంటూ బిగ్ బాస్ కోరారు. దీంతో.. హౌస్ మేట్స్ ఎవరికి వారు తమ వేదనల్ని చెప్పుకోవటంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎవరికి వారు తమ ఆవేదనల్ని షేర్ చేసుకోవటం.. ఆ సందర్భంగా వారు ఎమోషన్ అయిపోయి కన్నీళ్లు పెట్టటమేకాదు.. టీవీలో షో చూస్తున్న వారందరికి కన్నీళ్లు తెప్పించటంలో సక్సెస్ అయ్యారు.

తన గతం గుర్తుకు వస్తే చాలు.. ట్యాప్ తిప్పినట్లుగా కన్నీళ్లు బొటబొట కార్చేసే శివజ్యోతి ఏడ్చేసింది. గలగల మాట్లాడే శివజ్యోతి అక్క గతం కన్నీళ్లను తెప్పించేసింది. ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. ఈ వ్యవహారంలో ఫస్ట్ తన గతాన్ని చెప్పుకొచ్చారు అలీ రెజా. తన కారణంగా తన భార్య యాక్సిడెంట్ లో గాయపడిందని.. అందుకు అతడు సారీ చెప్పాడు. తన ఇంట్లో ప్రేమ వ్యవహారంతో వచ్చిన సమస్యల్ని టీవీ9 జాఫర్ చెప్పి ఎమోషనల్ అయ్యేలా చేశాడు. తన లైఫ్ లో ఎదురైన యాక్సిడెంట్ గురించి రోహిణి చెప్పింది.

తన తల్లిదండ్రుల గురించి చెప్పిన రవికృష్ణ.. బాబా భాస్కర్‌ లు భావోద్వేగానికి గురై.. ప్రేక్షకుల్ని ఎమోషనల్ అయ్యేలా చేశారు. హౌస్ లో అల్లరిగా అందరిని నవ్విస్తూ.. సరదాగా ఉండే శ్రీముఖి తన గతాన్ని చెప్పి అయ్యో అనిపించేలా చేసింది. తన తాత చనిపోయే ముందు తనను చూడాలని అనుకున్నారని.. అయితే ఆయన తనను చూడకుండానే చనిపోయారన్నారు. తాతకు పక్షవాతం ఉందని.. ఆ విషయాన్ని చెప్పలేకపోయిన వైనంపై కన్నీరుమున్నీరైంది. శ్రీముఖి గతంతో హౌస్ మేట్స్ సైతం కన్నీరు కార్చేశారు. ఇక.. ఇప్పటికే తన ప్రేమ కథను చెప్పటం ద్వారా ఎమోషన్ అయ్యేలా చేసిన శివజ్యోతి తాజాగా మరోసారి తన రియల్ కథలోని కొన్ని విషయాల్ని చెప్పి.. అయ్యో అక్క ఇన్ని కష్టాల్ని ఎదుర్కొందా? అన్న భావనకు గురయ్యేలా చేశారు.

తనకు ఇష్టమైన వ్యక్తిని ప్రేమించినందుకు ఒక్క నాలుక మీద తప్పించి శరీరం మొత్తం దెబ్బలు తిన్నానని.. ఎవరైనా ప్రేమిస్తే నిన్ను చంపేస్తామంటారని.. కానీ తాను ప్రేమించినోడిని చంపేస్తానని బెదిరించారన్నారు. అలా ఊరంతా ఒకవైపు.. తాను ఒక్కదాన్నే ఒక వైపు ఉండి చివరకు తాను కోరుకున్నోడితో వచ్చేశానని చెప్పింది శివజ్యోతి. దీంతో.. హౌస్ మొత్తం ఒక్కసారి ఎమోషన్ అయ్యింది. తన స్నేహితుడ్ని కోల్పోయిన వైనాన్ని మహేశ్ విట్టా చెబితే.. తాను ఎంతో ప్రేమించిన వాడిని కోల్పోయిన తీరును పునర్నవి చెప్పి కన్నీళ్లు తెప్పించింది. వరుణ్ వాళ్ల నాన్న గురించి చెప్పుకొచ్చారు. తన కారణంగా వారు తనకు దూరంగా ఉన్నారని చెప్పారు. వితికా వాళ్ల పిన్ని గురించి చెప్పి.. ఆమెకు సారీ చెప్పారు. ఇలా ఎవరికి వారు తమ గతంలోని వేదనను బయటకు వెల్లడించి తాము ఎమోషన్ కావటమే కాదు.. హౌస్ మేట్స్ ను.. ప్రేక్షకుల్ని ఎమోషన్ అయ్యేలా చేయటంతో సక్సెస్ అయ్యారు.