Begin typing your search above and press return to search.

'క్రేజీ అంకుల్స్' ట్రైలర్: ఇరవైల్లో చెయ్యని అల్లర్లు యాభైల్లో చేసే అంకుల్స్ కథ

By:  Tupaki Desk   |   25 Dec 2020 3:20 PM GMT
క్రేజీ అంకుల్స్ ట్రైలర్: ఇరవైల్లో చెయ్యని అల్లర్లు యాభైల్లో చేసే అంకుల్స్ కథ
X
ప్రముఖ యాంకర్, 'బిగ్ బాస్-3' ఫేమ్ శ్రీముఖి ప్రధాన పాత్రలో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ''క్రేజీ అంకుల్స్‌''. ఈ చిత్రంలో సింగర్ మనో (నాగూర్ బాబు) - రాజారవీంద్ర - భరణి - పోసాని కృష్ణ మురళి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇ.సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గుడ్‌ సినిమా గ్రూప్‌ మరియు శ్రీవాస్ 2 క్రియేటీవ్స్ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తిని కలిగించిన మేకర్స్.. తాజాగా 'క్రేజీ అంకుల్స్' సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.

'ఇది హైదరాబాద్ లో ఉంటున్న రాజు - రెడ్డి - రావు అనే ట్రిపుల్ ఆర్ కథ.. కాదు కాదు వ్యధ' అనే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ముగ్గురు క్రేజీ అంకుల్స్‌ గా రాజా రవీంద్ర - మనో - భరణి కనిపిస్తున్నారు. 'మా వైఫ్ లు తాజ్ మహల్ ఒకటే.. చూడ్డానికి తప్ప ఎక్కడానికి పని చేయవు' అంటూ రాజారవీంద్ర చెప్పే డైలాగ్ నవ్వుతెప్పిస్తోంది. 'సింగర్లు యాంకర్లు స్టార్లు.. ఈ సెలబ్రిటీలలో చాలా మంది సైడ్ ఇన్కమ్ తోనే కదరా కార్లు బంగ్లాలు కొనేది' అనే డైలాగ్ తో సినిమా వాళ్ళ గురించి కూడా ప్రస్తావించినట్లు అర్థం అవుతోంది. మొత్తం మీద ట్రైలర్ చూస్తుంటే ఇది ఇరవైల్లో చెయ్యని అల్లర్లు యాభైల్లో చేసే క్రేజీ అంకుల్స్ కథ అని తెలుస్తోంది. ఈ సంక్రాంతికి మీ అల్లుళ్ళతో పాటు ఈ క్రేజీ అంకుల్స్ కూడా వస్తున్నారని మేకర్స్ ప్రకటించారు.

'క్రేజీ అంకుల్స్' చిత్రానికి డార్లింగ్ స్వామి స్టోరీ మరియు డైలాగ్స్ అందించారు. రఘు కుంచె సంగీతం సమకూర్చగా.. పి. బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ చిత్రాన్ని 2021 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.