Begin typing your search above and press return to search.

ఓటీటీలు వచ్చిన తర్వాతే వివాదాలు ఎక్కువయ్యాయా..?

By:  Tupaki Desk   |   8 July 2022 4:30 AM GMT
ఓటీటీలు వచ్చిన తర్వాతే వివాదాలు ఎక్కువయ్యాయా..?
X
ఇటీవల కాలంలో సినిమాలు - వెబ్ సిరీస్ ల చుట్టూ అనేక కాంట్రావర్షీలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా హిందూ దేవాలయాలు - దేవుళ్ళు దేవతలను కించ పరిచేలా చిత్రీకరిస్తున్నారంటూ ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. హిందూ సంప్రదాయాలను ఆచారాలను అగౌరవ పరిస్తూ మనోభావాలను దెబ్బ తీస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఇండియాలోకి ఓటీటీల సంస్కృతి వచ్చిన తర్వాతే ఇలాంటి వివాదాలు ఎక్కువయ్యాయని అభిప్రాయ పడేవారు కూడా ఉన్నారు. డిజిటల్ కంటెంట్ కు సెన్సార్ ఉండదు. దీన్ని అదనుగా చూసుకొని విచ్చలవిడిగా అసభ్యకరమైన కంటెంట్ ను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

చీఫ్ పబ్లిసిటీ కోసం తెలిసి చేస్తున్నారో.. తెలియక చేస్తున్నారో అనేది తెలియదు కానీ.. వివాదాస్పద కంటెంట్ తో వార్తల్లో నిలుస్తున్నారు. వీటిల్లో ఎక్కువ వెబ్ సిరీసులు - ఒరిజినల్ మూవీస్ ఉండటం గమనార్హం.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఆ మధ్య వచ్చిన 'తాండవ్' వెబ్ సిరీస్ లో హిందూ దేవతలను కించపరిచారని బీజేపీ నాయకులు - హిందూవాదులు మండిపడ్డారు. దీంతో ఆ సీన్స్ ని కత్తెర వేసి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

MX ప్లేయర్ యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్న 'ఆశ్రమ్' అనే వెబ్ సిరీస్ పై కూడా ఇలాంటి వివాదమే చెలరేగింది. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన 'లూడో' సినిమాలో హిందూ దేవుళ్లను కించపరిచేలా సన్నివేశాలు పెట్టారనే విమర్శలు వచ్చాయి.

అలానే 'బ్రహ్మాస్త్ర' ట్రైలర్ లో హీరో రణ్ బీర్ కపూర్ షూ ధరించి గుడిలోకి వెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల 'కాళి' పేరుతో తెరకెక్కిన ఓ డాక్యుమెంటరీ ఫస్ట్ లుక్ పై ఎంత రచ్చ జరిగిందో మనం చూశాం.

హిందూ దేవత కాళీ మాత వేషధారణలో ఉన్న నటి సిగరెట్ తాగుతున్నట్లు ఈ పోస్టర్ లో చూపబడింది. అంతేకాదు త్రిశూలంతోపాటు మరో చేత్తో LGBTQ+ కమ్యూనిటీకి ప్రతీకగా భావించే జెండా పట్టుకున్నట్లు చూపించారు. ఇదే పెద్ద వివాదానికి కారణమైంది. డైరెక్టర్ లీనా మణిమేకలై హిందూ సంఘాలు మండి పడ్డాయి. ఆమె పై కేసులు కూడా పెట్టారు. #ArrestLeenaManimekal అనే హ్యాష్ ట్యాగ్ తో నెటిజన్లు నేషనల్ వైడ్ ట్రెండ్ చేశారు.

ఇది మరువక ముందే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ రాబోయే సిరీస్ లో ఒకదానిలో హిందూ దేవుళ్ళను అభ్యంతరకరమైన రీతిలో చూపించడం పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 'రికార్డ్ ఆఫ్ రాగ్నరోక్ 2' సిరీస్ నుంచి కొత్తగా విడుదల చేసిన ట్రైలర్ లో, హిందూ దేవుళ్లైన శివుడు మరియు బుద్ధుడులను చూపించిన విధానం అందరి దృష్టిని ఆకర్షించింది.

శివుడు - బుద్ధుడిని డిజిటల్ గా సవరించిన పద్ధతిలో చూపించడాన్ని నెటిజన్లు తప్పు పడుతున్నారు. మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీసే విధంగా చిత్రీకరించి.. కోట్లాది మంది మనోభావాలతో ఆడుకుంటున్నారంటూ విరుచుకుపడుతున్నారు. మరి ఈ వివాదం పెద్దదిగా మారి నెట్ ఫ్లిక్స్ ను వెంటాడుతుందేమో చూడాలి.

ఏదేమైనా ఓటీటీలు ఇండియాలో ప్రసారం చేసే కంటెంట్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సున్నితమైన సమస్యలను సీరియస్ గా తీసుకొకపోతే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. భారతీయ ప్రేక్షకుల ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ కంటెంట్ ప్రొడ్యూస్ చేయాలని డిమాండ్స్ చేస్తున్నారు.