Begin typing your search above and press return to search.

కీర్తి సురేష్-మృణాల్ మ‌ధ్య ఉన్న క‌నెక్ష‌న్ ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   16 Oct 2022 11:30 AM GMT
కీర్తి సురేష్-మృణాల్ మ‌ధ్య ఉన్న క‌నెక్ష‌న్ ఏంటో తెలుసా?
X
కీర్తి సురేష్.. ఈ మలయాళ సోయగం గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకపోయినా తనదైన అందం, అభిన‌యం, ఆకట్టుకునే నటనా ప్రతిభతో సౌత్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. `మహానటి` సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మ‌ల‌యాళ‌ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

ఇక మృణాల్ ఠాకూర్ విషయానికి వస్తే.. సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించి.. `లవ్ సోనియా` అనే హిందీ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకున్న ఈ బ్యూటీ.. ఇటీవల విడుదలైన `సీతారామం` సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. యుద్ధ నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమ కావ్యమిది.

ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించగా.. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై అశ్వినీ దత్, స్వప్నా దత్ సంయుక్తంగా నిర్మించారు. ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం సంచ‌ల‌న విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో ఓవైపు ప్రిన్సెస్ నూర్జహాన్ మరోవైపు సీతామహాలక్ష్మిగా మృణాల్‌ తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. మహానటి కీర్తి సురేష్ కు, సీతామహాలక్ష్మి గా అలరించిన మృణాల్ ఠాకూర్ కు మ‌ధ్య ఒక చిన్న కనెక్షన్ ఉంది. అదేంటంటే సీతారామంలో మృణాల్ నటించడానికి ఒక రకంగా కీర్తి సురేష్ కారణమని చెప్పాలి. అవును, ఈ విషయాన్ని మృణాల్‌ స్వయంగా వెల్లడించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ మాట్లాడుతూ.. ``మెల్‌బోర్న్‌ ఫిలిం ఫెస్టివల్‌కు 'మహానటి' తరఫున నాగ్‌ అశ్విన్‌ వచ్చారు. ఆ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేశ్‌ నటన అద్భుతం. ఆమె నటన చూశాక అలాంటి అందమైన పాత్ర చేయాలని ఉందంటూ నాగ అశ్విన్ తో నా మనసులో మాటను బయట పెట్టాను. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకున్న ఆయన సీతారామం సినిమాలో నాకు అవకాశాన్ని క‌ల్పించారు. అలా సీతారామం ద్వారా వైజయంతీ ఫిలిమ్స్‌లో భాగమయ్యా`` అంటూ చెప్పుకొచ్చింది.

ఈ లెక్కన ప‌రోక్షంగా సీతారామంలో కీర్తి సురేష్ వల్లనే మృణాలకు అవకాశం ద‌క్కిందని చెప్పాలి. ఇక కీర్తి సురేష్ నటించిన `మహానటి` మరియు మృణాల్ నటించిన `సీతారామం`.. ఈ రెండు చిత్రాల్లోనూ దుల్క‌ర్‌ సల్మాన్‌నే హీరోగా నటించ‌డం విశేషం. అలాగే వైజయంతి మూవీస్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిల‌వ‌డ‌మే కాదు.. ప్రేక్ష‌కుల మ‌దిలో ఎప్ప‌టికీ గుర్తుండి పోయే సినిమాలుగా చెరుగ‌ని ముద్ర వేసుకున్నాయి.