Begin typing your search above and press return to search.

నంది అవార్డు దక్కకపోవడంపై పృథ్వీ కూడా..

By:  Tupaki Desk   |   16 Nov 2017 4:03 AM GMT
నంది అవార్డు దక్కకపోవడంపై పృథ్వీ కూడా..
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల విషయమై టాలీవుడ్లో పెద్ద చర్చే నడుస్తోంది. 2014 సంవత్సరానికి ‘మనం’ సినిమాకు కాకుండా ‘లెజెండ్’కు ‘లెజెండ్’ ఉత్తమ సినిమా అవార్డివ్డం.. ఆ సినిమాకు మొత్తంగా 9 పురస్కారాలు కట్టబెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ అవార్డుల్లో మెగా హీరోలకు అన్యాయం జరిగిందన్న అర్థం వచ్చేలా నిర్మాత బన్నీ వాస్ పెట్టినట్లుగా చెబుతున్న కామెంట్ కూడా దుమారం రేపింది. అలాగే దర్శకుడు మారుతి ఈ అవార్డుల్ని ఎద్దేవా చేసేలా ట్విట్టర్లో ఒక వీడియో పెట్టాడు. ‘రుద్రమదేవి’ సినిమాకు జరిగిన అన్యాయంపై దర్శక నిర్మాత గుణశేఖర్ ఘాటుగానే స్పందించాడు.

వీళ్లందరితో పాటు కమెడియన్ పృథ్వీ కూడా తనకు ‘లౌక్యం’ సినిమాకు నంది అవార్డు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.‘అవార్డు అందుకునే స్థాయి ఇంకా నీకు రాలేదురా అని కమిటీ వాళ్లు అన్నట్లుగా అనిపిస్తోందని పృథ్వీ అన్నాడు. ఏ ఏడాది అవార్డులు ఆ ఏడాదే ఇస్తే ఆ సినిమా సత్తా ఏంటో తెలుస్తుందని.. ఇలా గ్యాప్ ఇచ్చి ఒకేసారి మూడేళ్లకు అవార్డులివ్వడం కరెక్ట్ కాదని పృథ్వీ అభిప్రాయపడ్డాడు. కొని తెచ్చుకున్న అవార్డులు బయటకు వెళ్లినప్పుడు వెక్కిరిస్తాయని సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు ఓ సందర్భంలో అన్న విషయాన్ని పృథ్వీ గుర్తుచేయడం విశేషం. ‘మీ యాక్టింగ్‌ బాగుంటుంది. మాకు నచ్చింది.. అవార్డులదేముంది’ అని ప్రేక్షకులు తనతో అంటుంటారని.. మంచి నటులకు ఎందుకు అవార్డులు రావడం లేదన్న భావన ప్రజల్లో కూడా ఉందని అనడం ద్వారా పృథ్వీ పరోక్షంగా తన అసంతృప్తిని వెళ్లగక్కాడు.