Begin typing your search above and press return to search.

లక్ష వర్క్ కి 20వేలు తీస్కుంటా..

By:  Tupaki Desk   |   12 Dec 2016 6:34 PM GMT
లక్ష వర్క్ కి 20వేలు తీస్కుంటా..
X
మీలో ఎవరు కోటీశ్వరుడు.. గతంలో నాగార్జున హోస్ట్ చేసిన ఈ కార్యక్రమం.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హ్యాండిల్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇదే టైటిల్ తో ఓ సినిమా కూడా రూపొందింది. రిలీజ్ కి కూడా రెడీ అయిపోయింది. నవీన్ చంద్ర-పృథ్వీలు ప్రధాన పాత్రల్లో నటించగా.. సలోని-శృతి సేథి హీరోయిన్లుగా నటించారు. డిసెంబర్ 16న ఈ చిత్రం విడుదల కానుండగా.. మూవీ గురించి పలు ఇంట్రెస్టింగ్ సంగతులు చెప్పాడు కమెడియన్ పృథ్వీ.

ఈ సినిమాలు తాను హీరో అని అంతా అనుకుంటున్నారని.. అందులో నిజం లేదని.. కమెడియన్ కీలక పాత్ర పోషించినా కమెడియన్ మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలని కోట చెప్పిన మాట మర్చిపోనన్నాడు పృథ్వీ. సలోనీకి జంటగా నటించినా ఆమెతో ఓ పాట తప్ప ఎలాంటి కెమిస్ట్రీ ఉండదన్న థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ.. ఈ సినిమాకు అసలు హీరో నవీన్ చంద్రనే అంటున్నాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు కోసం ఓ పాట షూట్ చేయాల్సి ఉండగా.. వేరే షూటింగ్ లో కాలు బెణకడంతో కంగారు పడ్డాడట. అయితే.. నేను చేయిస్తాను అన్న గణేష్ మాస్టర్.. ఏకంగా ముఠామేస్త్రి స్టెప్ వేయించగా.. ఫస్ట్ షాట్ కే ఓకే అయిపోయిందని అన్నాడు.

ప్రస్తుతం డీమానిటైజేషన్ కారణంగా నిర్మాతలు షూటింగ్ కోసం కూడా కష్టపడాల్సి వస్తోందని.. తాను లక్ష రూపాయల వర్క్ కి 20వేలు తీసుకునేందుకు సిద్ధమన్న ఈ కమెడియన్.. అందరూ ఇలా ముందుకు వస్తే ఇండస్ట్రీకి మంచి జరుగుతుందంటూ మంచి మాటలు చెప్పడం విశేషం. కాటమరాయుడులో హీరోయిన్ కి బాబాయ్ గా నటిస్తున్నానని.. పవన్-శృతి హాసన్ లతో ఇన్నేసి సీన్లలో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాడీ బాయిలింగ్ స్టార్ పృథ్వీ.