Begin typing your search above and press return to search.

ఆకట్టుకుంటున్న 'వరుడు కావలెను' చిత్రంలోని 'వడ్డాణం' పాట..!

By:  Tupaki Desk   |   2 Oct 2021 6:08 AM GMT
ఆకట్టుకుంటున్న వరుడు కావలెను చిత్రంలోని వడ్డాణం పాట..!
X
యంగ్ హీరో నాగ శౌర్య - రీతూ వర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ''వరుడు కావలెను''. దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో శరవేగంగా ప్రమోషన్స్ చేస్తున్న మేకర్స్.. తాజాగా 'వడ్డాణం' అనే పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు.

'వడ్డాణం చుట్టేసి వచ్చారే భామలు.. వయ్యారం చిందేసే అందాల బొమ్మలు.. పరికిణిలో పడుచును చూస్తే పందిరంతా జాతరే.. అయ్యో రామా క్యా కరే..' అంటూ సాగిన ఫన్ అండ్ పెప్పీ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ గీతానికి ఎస్.ఎస్ థమన్ ట్యూన్ కంపోజ్ చేశారు. గేయ రచయిత రఘురామ్ దీనికి సాహిత్యం అందించారు.

'వడ్డాణం' పాటను ప్రస్తుతం టాలీవుడ్ లోని ప్రముఖ యువ సింగర్స్ అందరూ కలిసి ఆలపించడం విశేషం. గీతా మాధురి - ఏఎల్ గాయత్రి - అదితి భావరాజు - శృతి రంజని ఈ పాట పాడారు. వీరితో పాటుగా శ్రీకృష్ణ మరియు సత్య యామిని - సాహితీ - మనీషా - శ్రీనిధి - రవళి - అభిఖ్య వంటి వారు గొంతు కలిపారు.

పెళ్లి వేడుక నేపథ్యంలో వచ్చే ఈ 'వడ్డాణం' పాటకు బృంద మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇందులో హీరోహీరోయిన్లతో పాటుగా ఇతర మహిళా ప్రధాన తారాగణం అంతా పాల్గొన్నారు. ఈ సాంగ్ కోసం చేసిన ప్రొడక్షన్ డిజైనింగ్ కూడా బాగుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన పాటల తరహాలోనే 'వడ్డాణం' గీతం కూడా శ్రోతలను అలరిస్తోంది.

'వరుడు కావలెను' చిత్రంలో 'కోల కళ్ళే' 'మనసులోనే నిలచిపోకే' పాటలకు విశాల్ చంద్ర శేఖర్ స్వరాలు సమకూర్చారు. 'దిగు దిగు దిగు నాగ' 'వడ్డాణం' పాటలకు థమన్ ట్యూన్స్ అందించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రంతో లక్ష్మీ సౌజన్య అనే డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత.

ఈ చిత్రంలో నదియా - మురళీశర్మ - వెన్నెల కిశోర్ - ప్రవీణ్ - హర్ష వర్ధన్ - హిమజ - రజిత తదితరులు ఇతర పాత్రలు పోషించారు. వంశీ పచ్చిపులుసుల - విష్ణు శర్మ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేశారు. లవ్, ఫన్ అండ్ ఎమోషన్స్ కలబోసిన కుటుంబ కథా చిత్రం ''వరుడు కావలెను'' ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.