Begin typing your search above and press return to search.

RC15: చరణ్ పై క్లాప్ కొట్టిన చిరు.. గెస్టులుగా హాజరైన రాజమౌళి - రణవీర్ సింగ్

By:  Tupaki Desk   |   8 Sep 2021 7:38 AM GMT
RC15: చరణ్ పై క్లాప్ కొట్టిన చిరు.. గెస్టులుగా హాజరైన రాజమౌళి - రణవీర్ సింగ్
X
అగ్ర దర్శకుడు శంకర్ - మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించారు. ఈరోజు బుధవారం ఉదయం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ ముహూర్తం వేడుకలో చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి - దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి - బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై టీమ్‌ కు తమ బెస్ట్‌ విషెస్ అందించారు.

RC15 ముహూర్తపు సన్నివేశంలో భాగంగా తనయుడు రామ్‌ చరణ్‌ పై చిరంజీవి క్లాప్‌ కొట్టారు. ఈ సీన్ లో సూటు బూటు వేసుకొని స్టైలిష్ గా ఉన్న చరణ్ తో హీరోయిన్ కియరా అద్వానీ కూడా జత కట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #RC15 హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా ఈ సినిమా రూపొందనుంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై దిల్‌ రాజు - శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

RC15 ముహూర్తం సందర్భాన్ని పురస్కరించుకుని ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేసారు. నటీనటులు సాంకేతిక నిపుణులు అందరూ నల్ల కోటు వేసుకుని.. చేతుల్లో ఫైల్స్ - బ్యాగ్స్ పట్టుకుని ముందుకు కదులుతున్నారు. వీరి వెనుక చాలామంది ఉన్నట్లు శంకర్ స్టైల్ లో ఈ పోస్టర్ డిజైన్ చేయబడింది. దీనిని బట్టి ఇందులో రామ్ చరణ్‌ ప్రభుత్వాధికారి పాత్రలో కనిపించనున్నట్లు అర్థం అవుతుంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా బ్యాక్ డ్రాప్ మరియు చెర్రీ పాత్ర గురించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది.

'వినయ విధేయ రామ' తర్వాత కియరా అద్వానీ మరోసారి ఈ చిత్రంలో రామ్ చరణ్ తో రొమాన్స్ చేయనుంది. సీనియర్ హీరో శ్రీకాంత్‌ - సునీల్‌ - హీరోయిన్ అంజలి - మలయాళ స్టార్ జయరామ్ - నవీన్ చంద్ర ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. రామజోగయ్య శాస్త్రి - అనంత శ్రీరామ్ పాటలు రాస్తున్నారు. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంభాషణలు బుర్రా సాయి మాధవ్ రాస్తుంటే.. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

శంకర్ - చరణ్ చిత్రానికి ''విశ్వంభర'' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందనుంది. దిల్ రాజు బ్యానర్ లో రాబోతున్న ఈ 50వ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్ రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.