Begin typing your search above and press return to search.

ఈసారి చిరంజీవికి చేదు అనుభవం ఎదురవ్వదు కదా..?

By:  Tupaki Desk   |   21 Oct 2022 11:30 PM GMT
ఈసారి చిరంజీవికి చేదు అనుభవం ఎదురవ్వదు కదా..?
X
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల 'గాడ్‌ ఫాద‌ర్' అనే పొలిటికల్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మోహ‌న్‌ రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆశించిన మేరకు బాక్సాఫీస్ వసూళ్లు రాబట్టలేకపోయింది. 'ఆచార్య' పరాజయం తర్వాత చిరు మళ్ళీ తన స్టామినా ఏంటో చూపిస్తారని భావించగా.. ఈ సినిమా కూడా ట్రేడ్‌ లో అంచనాలను అందుకోలేకపోయింది.

'గాడ్ ఫాదర్' సినిమాకు మంచి మౌత్ టాక్ ఉన్నప్పటికీ, సినిమా ఫ్లాప్ అవ్వడానికి ప్రధాన కారణం రీమేక్ ఫ్యాక్టర్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మలయాళంలో ఘనవిజయం సాధించిన 'లూసిఫర్' చిత్రానికి తెలుగు రీమేక్ గా ఇది తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఒరిజినల్ మూవీ తెలుగు వెర్సన్ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఆల్రెడీ చూసేసిన కంటెంట్ కావడంతో జనాలు థియేటర్‌లకు వెళ్లడానికి ఆసక్తి చూప లేదనే కామెంట్స్ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు చిరంజీవి మెగా154 సినిమాతో వస్తున్నారు. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఇదొక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. అందులోనూ ఒరిజినల్ కథతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో మంచి హైప్ ఉంది. వింటేజ్ మెగాస్టార్ ను చూడబోతున్నామని ప్రమోషనల్ కంటెంట్ హామీ ఇచ్చింది. వచ్చే సంక్రాంతికి పూనకాలు గ్యారంటీ అని మెగా అభిమానులు భావిస్తున్నారు.

అయితే 'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరంజీవి మళ్లీ రీమేక్ బాట పట్టనున్నారు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న 'భోళా శంక‌ర్' సినిమా తమిళ్ లో హిట్ అయిన 'వేదాళం' చిత్రానికి అఫిషియల్ రీమేక్ అనే సంగతి తెలిసిందే. ఇది 2015లో వచ్చిన రొటీన్ మాస్ మసాలా యాక్షన్ మూవీ. యూట్యూబ్ లో ఈపాటికే అందరూ చాలాసార్లు చూసేశారు. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత మెగాస్టార్ ఆ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు.

చిరు ని తెలుగు నేటివిటీకి దృష్టిలో పెట్టుకొని తగినన్ని మార్పులు చేర్పులు చేసినా.. ఇది రీమేక్ అనే సంగతి మాత్రం మారదు. అందుకే మెగా అభిమానులు 'భోలా శంకర్' సినిమా విషయంలో కలవరపడుతున్నారని తెలుస్తోంది. బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉంటుందో.. మళ్ళీ చేదు అనుభవం మిగులుతుందేమో అని ఇప్పటి నుంచో ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో రీమేక్స్ తో పర్వాలేదనిపించిన మెహర్ రమేష్.. ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో అనే ఆశలు కూడా పెట్టుకుంటున్నారు.

'భోళా శంకర్' చిత్రంలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా.. ఆయనకు సోదరిగా మహానటి కీర్తి సురేష్ కనిపించనుంది. రామబ్రహ్మం సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైనెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మాణంలో భాగం పంచుకుంటోంది. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. 2023 లో ఈ సినిమా విడుదల అవుతుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.