Begin typing your search above and press return to search.

‘ఆశగా కాదు.. అవసరానికి అడుగుతున్నాం’.. తెలుగు ప్రభుత్వాలకు చిరు వినతి

By:  Tupaki Desk   |   20 Sep 2021 4:37 AM GMT
‘ఆశగా కాదు.. అవసరానికి అడుగుతున్నాం’.. తెలుగు ప్రభుత్వాలకు చిరు వినతి
X
అరుదైన పరిణామం చోటు చేసుకుంది. పిల్లి మెడలో గంట కట్టేందుకు ఎవరు చిక్కుతారా? అన్నట్లుగా ఎదురుచూసిన టాలీవుడ్ పరిశ్రమలో.. అదేదో తానే చేయాలన్నట్లుగా ముందుకు వచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించకుండా.. అదే పనిగా నానపెడుతున్న వేళ.. చూస్తూ కూడా చూడనట్లుగా వ్యవహరిస్తున్న సినీ రంగ ప్రముఖులకు భిన్నంగా తాజాగా పెదవి విప్పేశారు మెగాస్టార్. రీల్ మీద వీరోచితంగా పోరాడేవారు.. సినిమా ద్వారా సమాజాన్ని చైతన్య పర్చాలని చెప్పే సినీ ప్రముఖులు ఎవరూ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఓపెన్ గా మాట్లాడే ధైర్యం చేయని వేళ.. అందుకు భిన్నంగా ‘లవ్ స్టోరీ’ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు హాజరైన మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు వినతి చేసినట్లుగా చెబుతూనే.. తన టోన్ తో తాను ఇవ్వాల్సిన మెసేజ్ ను ఇచ్చేశారని చెప్పాలి. ‘మేము ఆశగా అడగటం లేదు. అవసరానికి అడుగుతున్నాం. అది మీరు ఒప్పుకోవాలని కోరుతున్నా’ అంటూ చిరు నోటి నుంచి వచ్చిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. సినీ రంగ ప్రముఖులు రాజకీయ రంగాన్ని.. ప్రభుత్వాల్ని ప్రభావితం చేయలేకపోతున్నారన్న వాదన బలంగా వినిపిస్తున్న వేళ.. ఆ వాదనకు చెక్ చెప్పేలా చిరు నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

కరోనా వేళ.. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని సూటిగా ప్రస్తావించటమే కాదు.. వాస్తవ పరిస్థితుల గురించి ఓపెన్ గా మాట్లాడేసిన చిరు తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఏ విపత్తు వచ్చినా తెలుగు చిత్ర పరిశ్రమ ముందుంటుందని.. కరోనా కారణంగా ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉందని.. ఇలాంటి వేళలో ఆదుకోవాల్సిన బాధ్యత తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉందన్నారు. పరిశ్రమ సాధక.. బాధకాల్ని గుర్తించి తగిన సాయం చేయాలన్న చిరంజీవి మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనేమన్నారు? చిత్ర పరిశ్ర మ ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఆయనేం మాట్లాడారన్నది ఆయన మాటల్లో చూస్తే..

- చిత్ర పరిశ్రమలో సక్సెస్ రేటు చాలా తక్కువ. పది నుంచి పదిహేను శాతం మాత్రమే ఉంటుంది. మహా అయితే ఇరవై శాతం. ఆ మాత్రం దానికే ఇండస్ట్రీ పచ్చగా.. కళకళలాడిపోతోందంటారు. కానీ.. ఇక్కడ కూడా కష్టాలుపడేవారున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు ప్రత్యక్షంగా వేలాది మంది పరోక్షంగా లక్షలాది మంది ఉన్నారు. ఇలాంటి వారంతా కలిస్తేనే చిత్ర పరిశ్రమ.

- నలుగురైదుగురు హీరోలు.. నిర్మాతలు.. దర్శకులు కలిస్తే ఇండస్ట్రీ కాదు. వీళ్లు బాగున్నారు కదా అని.. ఇండస్ట్రీ బాగుందనుకుంటే మెరిసేదంతా బంగారం కాదు. ఈ విషయం కరోనా వేళ స్పష్టంగా కనిపించింది. నాలుగైదు నెలలుగా షూటింగ్స్ ఆగిపోయేసరికి.. కార్మికులు అల్లాడిపోయారు.

- హీరోలను.. సినీ పెద్దలను.. నిర్మాతలను అడిగి డబ్బులు పోగు చేసి.. కార్మికుల కోసం నిత్యావసర సరుకులు అందించాం. పరిస్థితులు నెమ్మదిగా చక్కబడ్డాయి. కానీ.. ఒక నెల షూటింగ్ లేకపోతే కార్మికులు ఎంత ఇబ్బంది పడతారనే విషయాన్ని చెప్పటానికి ఈ మాట చెబుతున్నా.

- కొవిడ్ తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్ లకు హాజరు కావటం చిన్నపిల్లాడు స్కూల్ కు వెళుతున్న భావన కలుగుతోంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని అందరికి శుభాకాంక్షలు చెబుతున్నా.

- తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు లవ్ స్టోరీ ప్రీరిలీజ్ వేడుక వేదికగా ఒక వినతి చేస్తున్నా. అనుకున్న స్థాయిలో ఆదాయం రాకపోవటానికి కారణం ఏమిటి? ఇంకా ఏం చేస్తే చిత్ర పరిశ్రమ బాగుంటుంది? ఇలా అన్నింటినీ పరిగణలోకి తీసుకొని ప్రభుత్వాలు ఆదుకోవాలి.

- కూరగాయల్ని ముందు చూసి ఆ తర్వాతే కొంటాం. కానీ ముందు కొనేసి ఆ తర్వాత చూసేది మాత్రం సినిమానే. మా మీద నమ్మకంతో మీరు సినిమాలు చూస్తున్నారు. చిరంజీవి ఉన్నాడంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని మరో ఆలోచన లేకుండా థియేటర్ కు వస్తారు. మేం కూడా మీరు నిరాశకు గురి కాకుండా ప్రయత్నిస్తున్నాం. ఈ కారణం వల్ల వ్యయం పెరగొచ్చు.

- సినిమాలు పూర్తి అయి కూడా మరో సినిమా చేయాలా? వద్దా? అన్న సందిగ్ధంలో పడిపోయాం. ఆచార్య అయిపోయింది. ఎప్పుడు విడుదల చేయాలి? ఎలా రిలీజ్ చేయాలి? చేస్తే రెవెన్యూ వస్తుందా? లాంటి ప్రశ్నలు వెంటాడుతున్నాయి. జనాలు వస్తారా? లేదా? అన్న దాని నుంచి ఇప్పుడిప్పుడే ధైర్యం వస్తోంది. ‘లవ్ స్టోరీ’ అన్నింటికీ దారి చూపే సినిమా అవుతుంది. రెవెన్యూ ఎంత వస్తుందనేది ఇప్పుడే చెప్పలేం. కానీ ఈ విషయంలో ప్రభుత్వాలు మనకు ధైర్యం.. వెసులుబాటు ఇవ్వాలి. వీలైనంత త్వరగా చిత్రపరిశ్రమకు మేలు చేసే జీవోలు విడుదల చేయండి.