Begin typing your search above and press return to search.

సినీ ప్రముఖులతో భేటీ అవుతున్న చిరంజీవి..?

By:  Tupaki Desk   |   7 Feb 2022 9:30 AM GMT
సినీ ప్రముఖులతో భేటీ అవుతున్న చిరంజీవి..?
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్ల వ్యవహారం ఇంకా సాగుతూనే ఉంది. ఇప్పటికే ఇండస్ట్రీ తరపున పలువురు సినీ ప్రముఖులు ఈ అంశం మీద ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసారు. సీనియర్ స్టార్ హీరో చిరంజీవి ఈ సమస్యను ఓ కొలిక్కి తీసుకురావాలని తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం మీద ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రేపు మంగళవారం సినీ ఇండస్ట్రీ పెద్దలతో చిరు సమావేశం కానున్నారని వార్తలు వస్తున్నాయి.

గత నెలలో ఏపీ సీఎంతో జరిగిన లంచ్‌ భేటీలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని సమస్యలను వివరించారు చిరంజీవి. సినిమా టికెట్ల ధరలను పెంచాలని.. కోవిడ్‌ దృష్ట్యా కష్టాల్లో ఉన్న సినీ కార్మికులను ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకోవాలని.. నిర్మాతలు ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కు అండగా ఉండాలని విజ్ఞప్తి చేసారు. దీనిపై సీఎం జగన్‌ కూడా సానుకూలంగా స్పందించారని చిరు తెలిపారు. త్వరలోనే ఇండస్ట్రీ కష్టాలన్నీ గట్టెక్కుతాయని.. అప్పటి వరకు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు ఎవరూ నోరు జారవద్దని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భేటీలో చర్చించిన అంశాలను ఫిలిం ఛాంబర్ - కౌన్సిల్ - గిల్డ్ సభ్యులకు వివరిస్తానని.. వీటిని మరో మీటింగ్ లో సీఎం దృష్టికి తీసుకెళ్తానని చిరంజీవి ఈ సందర్భంగా చెప్పారు. అయితే మెగాస్టార్ కోవిడ్ బారిన పడటంతో ఈ సమావేశం ఆలస్యమైంది. ఇప్పుడు వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న చిరు.. రేపు (ఫిబ్రవరి 8) సినీ ప్రముఖులతో భేటీ కాబోతున్నారట.

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో పరిశ్రమలోని అన్ని సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారని అంటున్నారు. ఇదే కనుక నిజమైతే సినిమా టిక్కెట్ల వ్యవహారం మొదలు థియేటర్ల అంశాల వరకు అన్నీ ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. మళ్లీ ఏపీ సీఎం జగన్‌ తో జరిగే భేటీలో ఏయే అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలన్నదానిపై కూడా డిస్కస్ చేయనున్నారు.

ఇండస్ట్రీ పెద్దగా కాకుండా.. బాధ్యత గల బిడ్డగా టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చిరంజీవి చెబుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు సినీ పెద్దలతో భేటీ అవుతున్నారనే వార్తలు వస్తుండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏపీ హైకోర్టులో ఫిబ్రవరి 10న టికెట్ల అంశం మీద తదుపరి విచారణ జరగనుంది. అప్పటిలోగా ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక అందించడానికి కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. మరి త్వరలోనే ఏ అంశం మీద ఇండస్ట్రీకి అనుకూలంగా సరికొత్త జీవో వస్తుందేమో చూడాలి.