Begin typing your search above and press return to search.

'జెర్సీ' డైరెక్టర్ మూవీలో చరణ్ డ్రీమ్ రోల్!

By:  Tupaki Desk   |   15 Nov 2021 7:49 AM GMT
జెర్సీ డైరెక్టర్ మూవీలో చరణ్ డ్రీమ్ రోల్!
X
చరణ్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. కథ కొత్తగా అనిపిస్తే ఇటు యంగ్ డైరెక్టర్లతో పాటు, అటు సీనియర్ స్టార్ డైరెక్టర్ల సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' చేసిన ఆయన, కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రను చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా ఒక నెల గ్యాపులో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ రెండు సినిమాల జోనర్లు వేరైనా చరణ్ పాత్ర మాత్రం ఉద్యమకారుడిగా .. పోరాట యోధుడిగా కొనసాగనుండటం విశేషం.

ఈ రెండు సినిమాలు విడుదలకు ముస్తాబవుతూ ఉండగానే, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి చరణ్ ఓకే చెప్పాడు. చాలా తక్కువ గ్యాపులోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కింది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా, రీసెంట్ గా ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకుంది. సినిమాలో కీలకమైన సందర్భంలో వచ్చే ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణను ఈ షెడ్యూల్లో పూర్తి చేశారు. ఈ రోజున సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. ప్రధాన పాత్రల కాంబినేషన్లో నడిచే కొన్ని సన్నివేశాలను ఈ షెడ్యూల్లో ప్లాన్ చేశారు.

ఇక గతంలో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చరణ్ మాట్లాడుతూ .. 'స్పోర్ట్స్ డ్రామా'లో చేయాలని ఉందని అన్నాడు. స్పోర్ట్స్ మెన్ గా కనిపించడమనేది తన డ్రీమ్ అనీ .. అలాంటి పాత్రకోసం వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. ఇక త్వరలోనే ఆయన డ్రీమ్ నెరవేరనున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఆయన ఒక స్పోర్ట్స్ డ్రామా చేయనున్నాడు .. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా మొదలైపోయాయి. ఎవరా డైరక్టర్ .. ఏమా కథ అంటే 'గౌతమ్ తిన్ననూరి' పేరు చెప్పవలసి ఉంటుంది. తొలి సినిమా అయిన 'జెర్సీ'తోనే ఆయన అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడు. నానీకి భారీ హిట్ ను .. నిర్మాతలకు భారీ వసూళ్లను ముట్టజెప్పాడు.

ఆ తరువాత ఆయన ఇదే సినిమాను హిందీలోను రీమేక్ చేశాడు. మళ్లీ ఇప్పుడు చరణ్ తో సినిమా చేయడానికి రంగంలోకి దిగుతున్నాడు. ఇది కూడా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే కథనే. ఈ ప్రాజెక్టు పట్ల చరణ్ చాలా ఆసక్తిగా ఉన్నాడని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమా తరువాత చరణ్ మరో తమిళ దర్శకుడిని లైన్లో పెట్టినట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది .. ఆ దర్శకుడి పేరే ధరణి. తమిళంలో మమ్ముట్టి .. విక్రమ్ .. విజయ్ .. శింబులతో ఆయన సినిమాలు చేశాడు. తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా 'బంగారం' సినిమా చేసింది ఈయనే. మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు చరణ్ సినిమా చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.