Begin typing your search above and press return to search.

'ఆచార్య' హిందీ రిలీజ్ పై చరణ్ క్లారిటీ..!

By:  Tupaki Desk   |   25 April 2022 7:30 AM GMT
ఆచార్య హిందీ రిలీజ్ పై చరణ్ క్లారిటీ..!
X
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ''ఆచార్య'' సినిమా గ్రాండ్ రిలీజ్‌ కు రెడీ అయింది. ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు.

అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్నా మెగా మూవీ హిందీలో డబ్ అవుతుందా లేదా అనే విషయం మీద క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ఇంటరాక్ట్ అయిన రామ్ చరణ్.. త్వరలో ‘ఆచార్య’ హిందీ రిలీజ్ ఉంటుందని స్పష్టం చేశారు.

'ఆచార్య' చిత్రాన్ని తెలుగుతో పాటుగా హిందీలో కూడా విడుదల చేయనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ కు చెందిన పెన్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నార్త్ ఇండియా ప్రేక్షకులకు అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

'సైరా నరసింహా రెడ్డి' చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేసిన చిరంజీవికి నిరాశ ఎదురైంది. అయితే RRR సినిమాతో చరణ్ కు పాన్ ఇండియా స్థాయిలో పేరొచ్చింది. ఈ నేపథ్యంలో 'ఆచార్య' సినిమాని ఇతర భాషల్లో రిలీజ్ చేస్తే మార్కెట్ పరంగా కచ్చితంగా వర్కవుట్ అవుతుందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయ పడ్డారు.

కానీ ఈ మధ్య కాలంలో 'ఆచార్య' సినిమాని ఇతర భాషల్లోకి అనువధించే కార్యక్రమాలు జరగలేదు. దీంతో హిందీ రిలీజ్ లేకపోవచ్చనే కామెంట్స్ వినిపించాయి. అయితే దీనిపై తాజాగా చరణ్ మాట్లాడుతూ.. ముందుగా ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో విడుదల చేయాలని అనికోలేదని తెలిపారు

కాకపోతే ఆర్.ఆర్.ఆర్ దృష్ట్యా 'ఆచార్య' ను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తే బాగుంటుందనిపించిందన్నారు. అయితే డబ్బింగ్ - పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం కావాలని.. RRR మరియు RC15 సినిమాల షూటింగ్ కారణంగా తనకు అంత సమయం లేదని చెర్రీ పేర్కొన్నారు. మంచి కథ కాబట్టి ‘ఆచార్య’ హిందీ వెర్షన్ ను త్వరలో విడుదల చేస్తామని చెర్రీ స్పష్టం చేశారు.

అంతేకాదు అందులో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెబుతానని అన్నారు. తెలుగుతో పాటుగా ఒకేసారి బాలీవుడ్ లో రిలీజ్ కావాపోవడం మెగా అభిమానులను కాస్త నిరాశ పరిచే విషయమే. అయితే భవిష్యత్ లో హిందీ రిలీజ్ ఉంటుందని ప్రకటించడం సంతోషించదగినదే.

ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' సినిమాని హిందీలో విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగులో ఫలితాన్ని దృష్టిలో పెట్టుకునే డబ్బింగ్ చేయడం లేదని కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇప్పుడు 'ఆచార్య' సినిమాని ఇతర భాషల్లో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.

కాగా, 'ఆచార్య' చిత్రాన్ని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించారు. ఇందులో రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా.. సోనూసూద్ - జిషు సేన్ గుప్తా - వెన్నెల కిశోర్ - పోసాని కృష్ణ మురళి - తనికెళ్ళ భరణి - సౌరవ్ లోకేష్ కీలక పాత్రలు పోషించారు.

కొణిదెల ప్రొడక్షన్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిర్మించారు. నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి నిర్మాతలు. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. తిరునవుక్కరసు సినిమాటోగ్రఫీ అందించగా.. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.