Begin typing your search above and press return to search.

మార్చిలో జ‌న్మించిన ప్ర‌ముఖులు.. మీ హీరోలు ఉన్నారేమో చూడండి!

By:  Tupaki Desk   |   2 March 2021 2:30 PM GMT
మార్చిలో జ‌న్మించిన ప్ర‌ముఖులు.. మీ హీరోలు ఉన్నారేమో చూడండి!
X
నితీశ్ కుమార్ : ప్రస్తుత బిహార్ ముఖ్య‌మంత్రిగా ఉన్న నితీశ్‌.. బిహార్లోని భక్తి‌పూర్‌లో 1951 మార్చి 1న జన్మించారు. ఎన్ఐటీ పాట్నా నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌‌లో బీటెక్ పూర్తి చేశారు. బిహార్ స్టేట్ ఎలక్ట్రిక్ బోర్డులో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో చేరారు. కేంద్రం రైల్వే మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా కూడా పని చేశారు. 2010లో బిహార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.

ఎంకే స్టాలిన్ : తమిళనాడు మాజీ ముఖ్య‌మంత్రి కరుణానిధి కుమారుడు. కరుణానిధి మరణం తర్వాత డీఎంకే పార్టీ బాధ్యతలను ఆయ‌న‌ చేపట్టారు. కరుణానిధి రెండో భార్య దయాళు అమ్మాల్‌కు 1953 మార్చి 1న జన్మించారు స్టాలిన్‌. ప్ర‌స్తుతం త‌మిళ ఎన్నిక‌ల్లో గెలిచి ముఖ్య‌మంత్రి కావాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

మేరీ కోమ్ : భారత బాక్సింగ్ మహిళా ర‌త్నం మేరికోమ్ 1983 మార్చి 1న మణిపూర్‌లో జన్మించారు. మ‌హిళా బాక్సింగ్ లో ఆమె ఎన్నో ఘ‌న‌త‌లు న‌మోదు చేశారు. వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ను ఆరుసార్లు గెలుపొందిన ఏకైక మహిళగా రికార్డు సృష్టించారు. పిల్లలకు జ‌న్మ‌నించిన త‌ర్వాత‌ కూడా ఆమె బాక్సింగ్‌లో సత్తా చాటాడం విశేషం. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళా బాక్సర్ కూడా ఆమె మాత్ర‌మే కావడం విశేషం. 2016లో రాష్ట్రపతి ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు. ‘మేరీకోమ్’ పేరిట బయోపిక్ కూడా వచ్చింది.

శ్రద్ధా కపూర్: సినీనటి శ్రద్ధా కపూర్ మార్చి 3, 1987న ముంబైలో జన్మించారు. బాలీవుడ్లో ఆషిఖీ-2 సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. గతేడాడి విడుదలైన ప్రభాస్ ‘సాహో’లో హీరోయిన్‌గా నటించింది.

శంకర్ మహదేవన్ : ప్రముఖ ఇండియన్ సింగర్, మ్యూజిక్ కంపోజర్ గా గుర్తింపు తెచ్చుకున్న శంకర్ మహదేవన్ 1963 మార్చి 3న జన్మించారు. స్వతహాగా తమిళుడు అయినా.. ముంబైలో ఉంటున్నారు. గాయకుడిగా నేషనల్ ఫిల్మ్ అవార్డులు, ఫిల్మ్‌ఫేర్‌లను కూడా గెలుచుకున్నారు.

జంషెడ్జీ టాటా: భారతదేశ తొలితరం పారిశ్రామిక వేత్త జంషెడ్జీ టాటా 1839 మార్చి 3న బరోడా సమీపంలోని నవ్సారీలో పార్శీ కుటుంబంలో జన్మించారు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడైన టాటాను పారిశ్రామిక రంగ పితామహుడిగా పిలుస్తారు. ముంబైలో తాజ్ మహల్ హోటల్‌ను ఆయనే నిర్మించారు. భారత్‌లో ఎలక్ట్రిసిటీ ఉన్న తొలి హోటల్ అది. తర్వాత ఆయన వారసులు టాటా స్టీల్‌ను ఏర్పాటు చేశారు. ఆసియాలోనే తొలి స్టీల్ కంపెనీ ఇది. ప్రపంచంలో ఐదో అతిపెద్ద స్టీల్ కంపెనీగా ఇది అవతరించింది. బెంగళూరులో ఇండియన్ ఇన్‌స్టిట్యూల్ ఆఫ్ సైన్స్‌ టాటాలే ఏర్పాటు చేశారు. జంషెడ్జీ లక్ష్యానికి అనుగుణంగా టాటా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ సప్లయ్ కంపెనీ కూడా ఏర్పాటైంది. తర్వాత దాన్ని టాటా పవన్ కంపెనీ లిమిటెడ్‌గా మార్చారు. ప్రస్తుతం దేశంలో ప్రైవేట్ రంగంలో ఉన్న అతిపెద్ద ఎలక్ట్రిసిటీ కంపెనీ ఇది. వ్యాపార పని నిమిత్తం జర్మనీ వెళ్లిన జంషెడ్జీ 1904 మే 19న మరణించారు. ఆయన అంత్యక్రియలు మాత్రం ఇంగ్లాండ్‌లో నిర్వహించారు.

శ్రద్ధా దాస్: ముంబైలోని బెంగాలీ కుటుంబంలో జన్మించిందీ శ్రద్ధా దాస్. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో ప‌లు సినిమాల్లో న‌టించింది. సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత‌ ఆర్య-2, డార్లింగ్, పీఎస్‌వీ గరుడ వేగ తదితర చిత్రాల్లో నటించింది.

కమలినీ ముఖర్జీ: కోల్‌కతాకు చెందిన కమలినీ ముఖర్జీ.. ద‌ర్శ‌కుడు శేఖర్ కమ్ముల సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆనంద్, గోదావరి, గమ్యం, గోపీ గోపికా గోదావరి, నాగవల్లి, విరోధి లాంటి చిత్రాల్లో నటించారు.

చంద్రశేఖర్ యేలేటి: ప‌్ర‌ముఖ‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న‌ చంద్రశేఖర్ యేలేటి మార్చి 4, 1973న తునిలో జన్మించారు. ‘ఐతే’ సినిమాతో నంది అవార్డు గెలుపొందారు. అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా లాంటి చిత్రాలను ఆయ‌న తెర‌కెక్కించారు.

రోహన్ బోపన్న: కర్ణాటకకు చెందిన బోపన్న భారత టెన్నిస్ ప్లేయర్. 2010లో యూఎస్ ఓపెన్ డబుల్స్‌లో ఖురేషితో కలిసి రన్నరప్ సాధించాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియాతో కలిసి ఆడాడు.

వరలక్ష్మీ శరత్ కుమార్: త‌మిళ్ స్టార్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ. ‘పోడా పోడీ’ చిత్రంతో నటిగా పరిచయమయ్యారు. తెలుగులో క్రాక్, నాంది చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు.

శివరాజ్ సింగ్ చౌహాన్ : మధ్యప్రదేశ్ బీజేపీ సీఎంగా 2005 నుంచి 2018 వరకు పని చేశారు. 1991-2006 మధ్య విదిశ ఎంపీగా పని చేశారు. 1972లో 13 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్‌‌లో చేరారు. 2018 చివర్లో జరిగిన ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని బీజేపీ స్వల్ప తేడాతో కాంగ్రెస్‌కు అధికారాన్ని కోల్పోయింది. ఆయన 1959 మార్చి 5న జన్మించారు.

శ‌ర్వానంద్ : టాలీవుడ్ హీరో శర్వానంద్ 1984 మార్చి 6న జన్మించాడు. హైదరాబాద్‌లో జన్మించిన ఆయన వెస్లీ డిగ్రీ కాలేజీలో బీకాం చదివాడు. చిరంజీవితో థమ్స్ అప్ యాడ్‌లో కనిపించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘ఐదవ తారీఖు’సినిమాతో అరంగేట్రం చేశాడు. చిరంజీవితో కలిసి శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో నటించాడు. సంక్రాంతి, లక్ష్మీ చిత్రాల్లో వెంకటేష్‌తో నటించాడు. ఆ తర్వాత హీరోగా మారి, గమ్యం, ప్రస్థానం, నువ్వా నేనా, రన్ రాజా రన్, శతమానం భవతి, మహానుభావుడు తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.

అనుపమ్ ఖేర్ : కాశ్మీరీ పండిట్ కుటుంబానికి చెందిన అనుపమ్ ఖేర్ 1955 మార్చి 7న సిమ్లాలో జన్మించారు. బాలీవుడ్ లో ప్ర‌ముఖ న‌టుడిగా ఆయ‌న గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించారు.

వ‌సుంధ‌ర రాజే : రాజస్థాన్ మాజీ సీఎం అయిన వసుంధర.. సింథియా మరాఠా రాజకుటుంబంలో 1953 మార్చి 8న జన్మించారు. తమిళనాడులోని కొడైకెనాల్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు. 1985లో ఆమె తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989-2003 మధ్య ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2003 డిసెంబర్ 8న రాజస్థాన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. తర్వాతి ఎన్నికల్లో ఓటమిపాలైన ఆమె.. 2013 డిసెంబర్ 8న తిరిగి రాజస్థాన్ ముఖ్య‌మంత్రి అయ్యారు. 2018 డిసెంబర్ 7న జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవ‌డంతో సీఎం ప‌ద‌వికి రాజీనామాచేశారు.

జాకీర్ హుస్సేన్ : ప‌్ర‌ముఖ‌ తబాలా వాయిద్యకారుడైన జాకీర్ హుస్సేన్ 1951 మార్చి 9న జన్మించాడు. ఆయ‌న త‌న ప్రావీణ్యంతో కీర్తిప్ర‌తిష్ట‌లు సొంతం చేసుకున్నారు. 1998లో ఆయనకు పద్మశ్రీ లభించింది. 2002లో పద్మభూషణ్ వరించింది. 1990లో సంగీత్ నాటక్ అవార్డును గెలుచుకున్నారు.

పార్థివ్ ప‌టేల్ : టీమిండియా మాజీ క్రికెటర్ పార్థీవ్ పటేల్ మార్చి 9, 1985న జన్మించాడు. కేవ‌లం 17 ఏళ్లకే టీమిండియాకు ఆడి, అంద‌రినీ ఆక‌ర్షించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అతి పిన్న వయస్కుడిగా పార్థీవ్ (17 ఏళ్ల 153 రోజులు) రికార్డు నెల‌కొల్పాడు. కానీ పెద్దగా ఆక‌ట్టుకోలేదు. ఆ త‌ర్వాత ధోనీ జట్టులోకి రావడంతో కనుమ‌రుగ‌య్యాడు.

నిమ్మ రాజిరెడ్డి : తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లా చేర్యాలకు చెందిన నిమ్మ రాజిరెడ్డి 1937 మార్చి 9న జన్మించారు. 1962లో వెల్దండ సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1978 నుంచి 21 ఏళ్లపాటు చేర్యాల ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించాక ఆ పార్టీలో చేరిన ఆయన వరుసగా విజయాలు సాధించారు. ఎన్టీఆర్ మంత్రి వర్గంలో జౌళి శాఖ మంత్రిగా, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో టీడీపీలో చీలికలు వచ్చిన సమయంలో ఆయన ఎన్టీఆర్ వైపు మొగ్గారు. చంద్రబాబు వర్గంలో చేరడానికి నిరాకరించారు. దీంతో 1999 ఎన్నికల్లో చంద్రబాబు రాజిరెడ్డికి టికెట్ ఇవ్వలేదు. నాటి నుంచి 2009లో చేర్యాల నియోజకవర్గం జనగామలో విలీనం అయ్యేంత వరకు అక్కడ టీడీపీ మళ్లీ గెలవలేదు.

తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపిన ఆయన తర్వాత టీఆర్ఎస్‌కు మద్దుతుగా నిలిచారు. 2004లో ఏప్రిల్‌లో రాజిరెడ్డితోపాటు మరో ఇద్దరు నేతలను చంద్రబాబు పార్టీ నుంచి బహిష్కరించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ-టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం పట్ల రాజిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై వ్యతిరేకతతో కాంగ్రెస్‌లో చేరిన ఆయన జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య గెలవడంలో కీలక పాత్ర పోషించారు. 2009 అక్టోబర్ 19న 72 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో మరణించారు.