Begin typing your search above and press return to search.

ఆ డైలాగ్ కోసం అంత కసరత్తు చేయాల్సి వచ్చిందట

By:  Tupaki Desk   |   10 Jan 2022 4:30 AM GMT
ఆ డైలాగ్ కోసం అంత కసరత్తు చేయాల్సి వచ్చిందట
X
సినిమా సూపర్ గా ఉందన్న మాట రావటానికి.. మిగిలిన అంశాలు ఎంతలా పని చేస్తాయో.. డైలాగుల పాత్ర అంతకు మించి అని చెప్పాలి. కథ బాగుండి.. డైలాగులు బాగాలేకపోయినా.. సీన్ నేరేషన్ అదిరేలా ఉన్నా.. అందుకు తగ్గట్లు ఎఫెక్టివ్ డైలాగ్ పడకున్నా.. విజువల్ వండర్ గా అనిపించి.. తేలిపోయే డైలాగులుంటే.. ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత ప్రాధాన్యత ఉన్న డైలాగులకు.. రావాల్సినంత పేరు మాత్రమే కాదు పేమెంట్ కూడా రాదు. అయినప్పటికీ.. అందుకోసం పడే శ్రమ మాత్రం కించిత్ తగ్గదు.

నిజానికి ఇట్టే చెప్పేసే డైలాగ్.. మదిలో నుంచి పేపర్ మీదకు వచ్చి.. దాన్ని దర్శకుడు ఓకే చెప్పే వరకు చాలానే ప్రాసెస్ ఉంటుంది. ఎన్నో మార్పులు చేర్పులు ఉంటాయి. డైలాగ్ రైటర్ గా ఇండస్ట్రీలో మంచి పేరున్న వారిలో బుర్ర సాయిమాధవ్ ఒకరు. టాలీవుడ్ లో సక్సెస్ అయిన సినిమాల్లో ఆయనభాగస్వామ్యం ఉంటుంది. ఆయన మాటలు.. సినిమా తర్వాత కూడా వెంటాడుతుంటాయి. అదే ఆయన మాటలకున్న మేజిక్.

అలాంటి ఆయన ఎన్నో సినిమాలకు పని చేసినా.. క్రిష్ దర్శకత్వం వహించిన కృష్ణం వందే జగద్గురుమ్ మూవీకి పని చేస్తున్నప్పుడు ఒక డైలాగ్ కోసం తాను పడిన శ్రమను అస్సలు మర్చిపోలేనని చెబుతారు బుర్రా. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. ‘‘ఒక సీన్ లో హీరోయిన్ తన డైలాగ్ తో హీరోను మార్చేస్తుంది.

దానికి సంబంధించి ఎన్ని వెర్షన్లు రాసినా క్రిష్ కు నచ్చట్లేదు. ప్రతి వెర్షన్ నాకు నచ్చుతోంది కానీ..క్రిష్ కు నచ్చట్లేదు. డైలాగ్ పేపర్ చూపించిన ప్రతిసారీ.. ఫర్లేదు సమయం తీసుకో. ఆ సీన్ తరువాత తీద్దామనే వారు. టైం గడిచిపోతోంది కానీ.. డైలాగ్ ఫైనల్ కావట్లేదు. చివరకు సినిమా పూర్తి చేయటానికి మూడు రోజుల టైం మిగిలింది. గుమ్మడికాయ కొట్టే టైం దగ్గరకు వస్తున్నా.. డైలాగ్ ఓకే కాలేదు’ అని చెప్పారు.

అలాంటి పరిస్థితుల్లో ఆయన రాసిన ఆ డైలాగ్ అందరి మనసుల్ని టచ్ చేయటమేకాదు.. సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా వెంటాడటమే కాదు..ఇప్పటికి ఆ డైలాగ్ విన్నంతనే ఒక్కసారిగా మనసు లోతైన ఆలోచనల్లోకి వెళ్లిపోతుంది. ఇంతకూ ఆ డైలాగ్ ఏమిటంటే.. ‘‘అమ్మ తొమ్మిదినెలలు కష్టపడితే మనం పుట్టామని అనుకుంటారు కొందరు.

కాదు.. నాన్న పక్కన పది నిమిషాలుసుఖపడితే పుట్టామని అనుకుంటారు మరికొందరు. రెండూ నిజాలే. కానీ.. పురిటి నొప్పులు చూసిన వాడు మనిషి అవుతాడు. పడక సుఖాన్ని చూసిన వాడు పశువవుతాడు’’ అని రాశా. దానికి క్రిష్ ఓకే చేశారు.

ఆ డైలాగ్ రాయటానికి తాను చాలా ఆలోచించానని.. కానీ క్రిష్ నచ్చకపోవటానికి కారణం ఏమిటని చూసినప్పుడు తనకు కలిగిన మధనం గురించి చెప్పుకొచ్చారు బుర్రా సాయి మాధవ్. ‘ఆ సీన్ లో రెండు నిజాలు కొట్టుకుంటున్నాయి. ఆ హీరోయిన్ చెప్పేది నిజమే. హీరో చెప్పేది నిజమే. కానీ.. హీరోయిన్ చెప్పేది గెలవాలి. ఆ మాటతో హీరో మారాలి. అలా ఆలోచించిన వేళ తట్టిన డైలాగ్ ఇది..’ అంటూ తన కష్టాన్ని చెప్పుకొచ్చాడు.