Begin typing your search above and press return to search.

డైలమాలో 100 కోట్ల సినిమా డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   7 July 2021 7:30 AM GMT
డైలమాలో 100 కోట్ల సినిమా డైరెక్టర్..!
X
'ఉప్పెన' సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేసిన ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో బుచ్చిబాబుకు అగ్ర నిర్మాణ సంస్థల నుంచి పిలుపు వచ్చింది. అయితే దర్శకుడు మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనే తన రెండో సినిమాని చేయనున్నట్లు మాట ఇచ్చారు. అయితే 'ఉప్పెన' వచ్చి నాలుగు నెలలు దాటిపోయినా ఇంకా బుచ్చిబాబు తదుపరి ప్రాజెక్ట్ పై క్లారిటీ రావడం లేదు.

సుకుమార్ వద్ద దర్శకత్వశాఖలో పని చేస్తున్నప్పటి పరిచయంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఓ కథ చెప్పారు బుచ్చిబాబు. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉండే స్టోరీ అని టాక్. తారక్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు. ఒకవేళ వచ్చినా ఇప్పట్లో స్టార్ హీరో డేట్స్ దొరికే పరిస్థితి లేదు. ఇప్పటికే ఎన్టీఆర్ కమిటైన సినిమాలు పూర్తి చేసుకొని బుచ్చిబాబు దగ్గరకు రావాలంటే చాలా సమయమే పడుతుంది. దీంతో మైత్రీ టీమ్ కూడా బుచ్చితో సినిమా ఉంద‌ని అంటున్నారు కానీ.. అది ఎన్టీఆర్ తోనే అని మాత్రం అఫీషియ‌ల్ గా చెప్ప‌లేదు.

ఈ నేపథ్యంలో ఇటీవల 'ఉప్పెన' దర్శకుడు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని కలవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. బన్నీ కి కథ చెప్పడానికే బుచ్చిబాబు అల్లు కాంపౌండ్ కి వెళ్లారని వార్తలు వచ్చాయి. కానీ ఇక్కడ విషయమేంటంటే అల్లు అర్జున్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు చెప్పిన స్టోరీ నచ్చినా.. ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడానికి కొంతకాలం ఎదురుచూడాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు బుచ్చిబాబు ఇతర స్టార్ హీరోల కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలెవరూ ఖాళీగా లేరు. అందరూ మూడు నాలుగు ప్రాజెక్ట్స్ చేతిలో పెట్టుకొని ఉన్నారు.

బుచ్చిబాబుకి స‌పోర్ట్ గా గురువు సుకుమార్ వ‌స్తున్నాడు కానీ.. సుక్కూ కూడా ప్రస్తుతం తన సొంత సినిమాలు చక్క‌దిద్దుకునే ప‌రిస్థితుల్లో ఉన్నాడు. డైరెక్ట్ చేసే సినిమాలతో పాటుగా ప్రొడ్యూస్ చేసే మూవీస్ ని చూసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఫస్ట్ సినిమాతోనే వంద కోట్లు గ్రాస్ సాధించిన దర్శకుడు.. ఇప్పుడు రెండో సినిమా విషయంలో డైలామాలో ఉన్నాడని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. మరి బుచ్చిబాబు కాంబోలో మైత్రీ టీమ్ ఏ హీరోతో ప్రాజెక్ట్ సెట్ చేస్తుందో చూడాలి.