Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్: 2 నెలలు.. 3 వేల కోట్లు..!

By:  Tupaki Desk   |   10 May 2022 4:22 AM GMT
బాక్సాఫీస్: 2 నెలలు.. 3 వేల కోట్లు..!
X
కరోనా మహమ్మారి కారణంగా అన్ని ఇండస్ట్రీల మాదిరిగానే చిత్ర పరిశ్రమ కూడా రెండేళ్ల పాటు భారీ నష్టాలను చవిచూసింది. అయితే పాండమిక్ తర్వాత దక్షిణాది చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడంతో.. వ్యాపారం మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది. దీంతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తిరిగి పుంజుకోవడమే కాదు.. పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది.

కోవిడ్-19 కారణంగా 2020 మొదటి రెండు నెలల్లో కొన్ని సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. 2021లో కూడా వైరస్ ప్రభావం ఉండటంతో మార్కెట్ బాగా దెబ్బతినింది. కాకపోతే ముందుటి ఏడాదితో పోల్చుకుంటే బెటర్ చాలా బెటర్ అనే చెప్పాలి. అయితే 2022 సంవత్సరం మాత్రం ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీకి బాగానే కలిసొచ్చింది.

జనాల్లో మహమ్మారి భయం పోవడంతో గడిచిన ఈ నాలుగు నెలల్లో అనేక సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో కోవిడ్ కారణంగా వాయిదా పడిన భారీ సినిమాలు కొన్నైతే.. మిగిలినవన్నీ చిన్న చిత్రాలు మరియు డబ్బింగ్ సినిమాలు. వరుసగా సినిమాలు రిలీజ్ అవడంతో పాండమిక్ కారణంగా కుదేలైన వ్యాపారం గాడిలోకి వచ్చింది.

ముఖ్యంగా గత రెండు నెలలుగా భారతీయ సినిమా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో భారీ బిజినెస్ జరిగింది. మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో అన్ని సినిమాలు కలువుకొని ఆల్ ఇండియా వైడ్ 3000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

రెండు నెలల్లో మూడు వేల కోట్ల వ్యాపారం అంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలో ఇదే అత్యధికమని చెప్పాలి. అయితే ఇందులో మేజర్ వాటా సౌత్ సినిమాలదే ఉంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన దక్షిణాది చిత్రాలు.. బాలీవుడ్ పై డామినేషన్ చూపించాయి. అందరూ ఆశ్చర్యపోయే సరికొత్త రికార్డులను నమోదు చేశాయి.

మార్చి & ఏప్రిల్ నెలల్లో అంత బిజినెస్ జరగడానికి 'RRR'- 'కేజీఎఫ్: చాప్టర్ 2' - 'రాధేశ్యామ్' - 'బీస్ట్' వంటి దక్షిణాది సినిమాలు ప్రధాన కారణంగా చెప్పాలి. ఈ లిస్టులో 'కాశ్మీర్ ఫైల్స్' 'గంగూబాయి కతీయవాడి' వంటి పలు హిందీ చిత్రాలు కూడా ఉన్నాయి. వీటిల్లో 'ఆర్.ఆర్.ఆర్' మరియు 'కేజీయఫ్ 2' సినిమాల వసూళ్ళు కలిపి 2200 కోట్లు ఉండటం గమనార్హం.