Begin typing your search above and press return to search.

గాల్లో తేలిపోతున్న తాప్సీ.. అందుకేనా?

By:  Tupaki Desk   |   30 April 2022 2:30 AM GMT
గాల్లో తేలిపోతున్న తాప్సీ.. అందుకేనా?
X
తాప్సీ పన్ను గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఢిల్లీలో పుట్టి పెరిగిన ఈ సొట్ట బుగ్గ‌ల సుంద‌రి.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి కె. రాఘవేంద్రరావు ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన 'ఝుమ్మందినాదం'తో సినీరంగ ప్ర‌వేశం చేసింది. మొద‌టి చిత్రంలోనే త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకున్న తాప్సీ.. ఆ త‌ర్వాత స్టార్ హీరోలతో క‌లిసి వ‌రుస పెట్టి సినిమాలు చేసి కావాల్సినంత క్రేజ్ ను కూడ‌బెట్టుకుంది. ఆపై బాలీవుడ్ కు మ‌ఖాం మార్చేసింది. తెలుగులో ఆఫ‌ర్లు వ‌స్తున్నా.. వాటిని ప‌క్క‌న పెట్టి మ‌రీ హిందీలో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది.

అయితే అక్క‌డా ఈ అమ్మ‌డు బాగానే స‌క్సెస్ అయింది. మహిళ ప్రాధాన్య‌త ఉన్న సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. మొత్తానికి త‌క్కువ స‌మ‌యంలో బాలీవుడ్‌లో స్థిరపడిన ఈ ఉత్తరాది సోయగం.. ప్ర‌స్తుతం ఆనందంతో గాల్లో తేలిపోతోంది. ఇందుకు కార‌ణం లేక‌పోలేదు. తాజాగా తాప్సీ బాలీవుడ్‌ అగ్రహీరో షారుఖ్ ఖాన్ సినిమాలో హీరోయిన్ గా న‌టించే అద్భుత‌మైన అవ‌కాశాన్ని కొట్టేసింది.

ప్ర‌ముఖ‌ డైరెక్ట‌ర్‌ రాజ్‌కుమార్‌ హిరాణితో షారుఖ్ ఖాన్ ఓ సినిమా చేస్తున్నాడు. అదే 'డంకీ'. రెడ్ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై షారుఖ్ ఖాన్‌ సతీమణి గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించబోతోంది.

త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న డంకీ చిత్రం.. వచ్చే ఏడాది డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇందులో షారుఖ్ ఖాన్ కు జోడీగా తాప్సీని ఎంపిక చేశారు. ఈ విష‌యాన్ని చిత్ర టీమ్ అధికారికంగా కూడా వెల్ల‌డించింది.

అయితే ఈ ఆఫ‌ర్ పై తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న తాప్సీ స్పందిస్తూ.. 'నా ఇన్నేళ్ల కెరీర్ లో ఇదే అద్భుతమైన అవకాశం. చాలా సంతోషంగా ఉంది. ఇదంతా ఓ కలలా అనిపిస్తోంది. షారుఖ్‌ నటననే కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని కూడా నేను ఎంతగానో ఇష్టపడతాను. సెట్స్‌లో ఫ్రీ టైమ్‌ దొరికితే.. షారుఖ్ సినీ ప్రయాణం, ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాల గురించి ఆయ‌న‌ను అడిగి తెలుసుకోవాలని ఆరాట‌ప‌డుతున్నా' అంటూ చెప్పుకొచ్చింది.

కాగా, తాప్సీ తెలుగులో చివ‌రిగా 'మిషన్ ఇంపాజిబుల్' అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. అయితే ఏప్రిల్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది.