Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కి క్యూ కడుతున్న బాలీవుడ్ భామలు!

By:  Tupaki Desk   |   7 April 2022 1:31 PM GMT
టాలీవుడ్ కి క్యూ కడుతున్న బాలీవుడ్ భామలు!
X
మొదటి నుంచి కూడా తెలుగు తెరపై బాలీవుడ్ భామలు మెరుస్తూనే వస్తున్నారు. అయితే అక్కడ స్టార్ హీరోయిన్స్ గా చక్రం తిప్పుతున్న వాళ్లు మాత్రం తెలుగు సినిమా చేయడమంటే ఒక మెట్టు దిగడం వంటిదని భావించేవారు. టాలీవుడ్లో చేస్తే అక్కడి వరకూ మాత్రమే తమ క్రేజ్ పరిమితమవుతుందని పెదవి విరిచే వారు. ఈ కారణంగానే ఇక్కడి నుంచి వెళ్లిన ఆఫర్లకి నో చెప్పినవారే ఎక్కువ. అందువల్లనే బాలీవుడ్ మోడల్స్ ను .. మలయాళ బ్యూటీలను రంగంలోకి దింపడం మొదలైంది. ఇక్కడ కాస్త క్రేజ్ రాగానే వీళ్లు కూడా అక్కడికే పరిగెత్తేవారు.

ఇలాంటి పరిస్థితుల్లోనే తెలుగు సినిమా తన రూపురేఖలను మార్చుకోవడం మొదలుపెట్టింది. తెలుగు సినిమా ఎల్లలు దాటుకుని దూసుకెళ్లడం తెలుసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు తెలుగు సినిమా పట్ల ఆసక్తిని కనబరచడం మొదలైంది. కథాపరంగా .. సాంకేతిక పరంగా .. మార్కెట్ పరంగా తెలుగు సినిమా పరిధి పెరుగుతూ పోసాగింది. పాన్ ఇండియా సినిమా పతాకాన్ని టాలీవుడ్ ఎగరేసింది. దాంతో తెలుగు సినిమాను చిన్నచూపు చూసిన భామలంతా .. ఇంత పారితోషికం ఇస్తేనే అంటూ బెట్టు చేసిన ముద్దుగుమ్మలంతా ఇప్పుడు కోలీవుడ్ కి క్యూ కడుతున్నారు.

పూరి జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందుతున్న 'లైగర్' సినిమాతో తెలుగు తెరకి అనన్య పాండే కథానాయికగా పరిచయమవుతోంది. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. ఆ తరువాత చేయనున్న 'జన గణ మన' సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్లో అడుగుపెడుతుందని అంటున్నారు.

ఇది కూడా పాన్ ఇండియా సినిమా కావడమే అందుకు కారణం. ఆల్రెడీ 'ఆర్ ఆర్ ఆర్' లో చేసిన అలియా భట్, ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఎన్టీఆర్ జోడీగా కొరటాల సినిమా చేయడానికి అంగీకరించింది. ఇక తెలుగులో రెండు సినిమాలు చేసిన కియారా మరోసారి చరణ్ సరసన మెరవడానికి అంగీకరించడం విశేషం.

వరుణ్ తేజ్ హీరోగా చేసిన 'గని' సినిమాలో ఆయన సరసన అందాల సందడి చేయడానికి సయీ మంజ్రేకర్ సిద్ధమవుతోంది. ఈ నెల 8వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. అఖిల్ 'ఏజెంట్' సినిమా ద్వారా సాక్షి వైద్య పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. రవితేజ రీసెంట్ గా పట్టాలెక్కించిన 'టైగర్ నాగేశ్వరరావు' ద్వారా పరిచయమవుతున్న నుపుర్ సనన్ కూడా బాలీవుడ్ భామనే.

ఇక సూపర్ హీరోగా ప్రభాస్ కనిపించనున్న 'ప్రాజెక్టు K'లో ఆయన సరసన దీపికా పదుకొనే చేయడం పతాకస్థాయిగా చెప్పుకోవచ్చు. బాలీవుడ్ భామలు ఇప్పుడు టాలీవుడ్ లో చేయడాన్ని గర్వంగా చెప్పుకుంటూ ఉండటం విశేషం. తెలుగు సినిమా ఎదుగుదలను సూచించే పరిణామాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు.