Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో బంధుప్రీతికి మించిన పెద్ద సమస్యలు ఉన్నాయి: యువ నటుడు

By:  Tupaki Desk   |   9 July 2020 12:30 AM GMT
ఇండస్ట్రీలో బంధుప్రీతికి మించిన పెద్ద సమస్యలు ఉన్నాయి: యువ నటుడు
X
బాలీవుడ్ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆకస్మిక మరణం పై అభిమానుల నుండి సెలబ్రిటీల వరకు ఎంతో బాధపడ్డారు. అలా ఎందుకు చేశాడా.. అని ఇంకా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కానీ ఈ సుశాంత్ మ‌ర‌ణంతో బాలీవుడ్ ఇండ‌స్ట్రీలోని చీకటి దారులన్నీ తెరుచుకుంటున్నాయి. ఇండస్ట్రీలో బంధుప్రీతి పై ఇంకా సోష‌ల్ మీడియాలో చ‌ర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో వార‌సుల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తుండగా.. తాజాగా 'నెపోటిజం గురించి మాట్లాడటం వల్ల లాభం లేదని.. పరిశ్రమలో మరెన్నో అన్యాయాలు జరుగుతుంటాయని' యాక్టర్ జీషన్ అయూబ్ ఆరోపించాడు.

జీషన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో "రాన్‌జానా.. తను వెడ్స్ మను రిటర్న్స్.. ఆర్టికల్ 15" సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించాడు. ఆయన మాట్లాడుతూ.. "ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్లు.. టెక్నీషియన్లకు మొదట్లో చెప్పడం ఒకటి కానీ తర్వాత జరిగేది ఒకటి. దీనిపై ఎవరు నోరుమెదపరు అంటున్నాడు జీషన్. స్క్రిప్ట్ వినిపించే టైంలో మీ పాత్ర అలా ఉంటుంది.. ఇలా ఉంటుంది.. ఆహా ఓహో అని చెబుతారు. కానీ ఆ తర్వాత మొత్తం స్క్రిప్టు మారిపోతుంది. దాని పై ఎలాంటి సమాచారం బయటికి రాకుండా పాత్రను కుదించేస్తారు.

తర్వాత మాట్లాడదాంలే అంటారు. అంతేగాక సినిమా పోస్టర్ మీద మీ బొమ్మ కూడా పడుతుందని చెప్తారు. ప్రమోషన్లలో ప్రాధాన్యం కల్పిస్తామని అంటారు. తీరా చూస్తే ఎక్కడా మన పేరు, బొమ్మ కనబడదు. చివరికి మీది లీడ్ క్యారెక్టర్లలో ఒకటని చెప్పి సినిమాకి ఒప్పిస్తారు. ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్‌ చేసి పడేస్తారు. ఇండస్ట్రీలో ఈ అన్యాయాల గురించి ఎవరూ మాట్లాడరు. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతికి మించిన పెద్ద సమస్య ఉంది. ఇలా చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని" జీషన్ వెల్లడించాడు.