Begin typing your search above and press return to search.

బిగ్ వార్ 2023: కింగ్ ఖాన్ వ‌ర్సెస్ ప్ర‌భాస్..!!

By:  Tupaki Desk   |   18 Oct 2022 12:30 AM GMT
బిగ్ వార్ 2023: కింగ్ ఖాన్ వ‌ర్సెస్ ప్ర‌భాస్..!!
X
2023లో టాలీవుడ్ వ‌ర్సెస్ బాలీవుడ్ వార్ ప‌రాకాష్ట‌కు చేర‌నుందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. వ‌చ్చే ఏడాదిలో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న మూడు భారీ చిత్రాలు విడుద‌లకు సిద్ధ‌మ‌వుతుంటే .. అదే ఏడాదిలో కింగ్ ఖాన్ షారూక్ బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల‌ను విడుద‌ల చేసేందుకు ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నాడు. దీని అర్థం ఇద్ద‌రు బిగ్ స్టార్స్ మ‌ధ్య బిగ్ క్లాష్ ఉంటుంద‌ని భావించాలి.

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు భారీ పాన్ ఇండియా చిత్రాల్లో న‌టిస్తూ జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారాడు. వేరే ఏ ఇత‌ర హీరో ఇంత స్పీడ్ లో లేడ‌నేది హిందీ మీడియాల క‌థ‌నాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌భాస్ న‌టిస్తున్న ఆదిపురుష్‌- సంక్రాంతి 2023 కి విడుద‌ల కానుంది. అలాగే ప్ర‌శాంత్ నీల్ తో స‌లార్ - 28 సెప్టెంబ‌ర్ 2023న విడుద‌ల‌వుతుంది. ఇక ప్ర‌భాస్ - నాగ్ అశ్విన్ ల భారీ సైన్స్ ఫిక్ష‌న్ సినిమా ప్రాజెక్ట్ కే- 2023 చివ‌రిలో విడుద‌ల‌య్యేందుకు ఆస్కారం ఉంద‌ని నిర్మాత అశ్వ‌ని ద‌త్ ఒకానొక సంద‌ర్భంలో వెల్ల‌డించారు. ఒక‌వేళ అప్పుడు కుద‌ర‌ని ప‌క్షంలో 2024 సంక్రాంతి బ‌రిలో ప్రాజెక్ట్ కే విడుద‌ల‌వుతుంద‌ని కూడా సూచించారు. నిజానికి ప్రాజెక్ట్ కే ని కూడా 2022లోనే రిలీజ్ చేయాల‌ని అనుకున్నా కానీ కోవిడ్ వ‌ల్ల ఇత‌ర సినిమాల త‌ర‌హాలోనే ఆల‌స్య‌మైంది. ప్ర‌భాస్ న‌టిస్తున్న మూడు సినిమాలు వేటిక‌వే ప్ర‌త్యేకమైన క‌థాంశాల‌తో తెర‌కెక్కుతున్నాయి. ఆదిపురుష్ చిత్రం రామాయ‌ణం - శ్రీ‌రాముడి స్ఫూర్తితో రూపొందుతుండ‌గా .. స‌లార్ భారీ మాఫియా కాప్ యాక్ష‌న్ చిత్రంగా రూపొందుతోంది. ప్రాజెక్ట కే అందుకు భిన్నంగా భార‌త‌దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ రాని స‌రికొత్త కాన్సెప్టుతో తెర‌కెక్కుతోంది. సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో మ‌రో లెవ‌ల్లో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారని ఇందులో న‌టిస్తున్న దీపిక పదుకొనే ఇప్ప‌టికే కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది.

ప్రభాస్ వ్య‌వ‌హారం ఇలా ఉంటే.. మ‌రోవైపు కింగ్ ఖాన్ షారూక్ కంబ్యాక్ కోసం చాలా క‌సిగా ప‌ని చేస్తున్నారు. అత‌డు బ్యాక్ టు బ్యాక్ మూడు భారీ చిత్రాల‌తో 2023లో స‌త్తా చాటేందుకు రాబోతున్నాడు. షారూక్ న‌టిస్తున్న భారీ యాక్ష‌న్ చిత్రం ప‌ఠాన్ జ‌న‌వ‌రి చివ‌రిలో విడుద‌ల కానుండ‌గా దేశ‌భ‌క్తి స్పై యాక్ష‌న్ నేప‌థ్యంలో అట్లీ రూపొందిస్తున్న జ‌వాన్ 2023 జూన్ లో విడుద‌ల కానుంది. ఇక రాజ్ కుమార్ హిరాణీ లాంటి సంచ‌ల‌నాల ద‌ర్శ‌కుడితో షారూక్ 'డుంకీ' లాంటి ప్ర‌యోగాత్మ చిత్రం చేస్తున్నాడు. వ‌ల‌స‌దారుల‌ క‌ష్టాల నేప‌థ్యంలోని ఈ మూవీ సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయ‌మ‌న్న అంచ‌నాలున్నాయి. డిసెంబ‌ర్ 2023లో ఈ మూవీని విడుద‌ల చేయాల‌న్న‌ది ప్లాన్. అన్నీ అనుకున్న‌ట్టే జ‌రిగితే షారూక్ కి వచ్చే ఏడాదిలో మూడు రిలీజ్ లున్నాయి.

డార్లింగ్ ప్ర‌భాస్ కి కూడా మూడు రిలీజ్ లు వ‌చ్చే ఏడాదిలో సాధ్య‌మేన‌ని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ తో టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ పోటీప‌డుతూ ఒకే ఏడాదిలో మూడు సినిమాల‌తో బ‌రిలో దిగ‌డం ఆస‌క్తిని క‌లిగించేదే. అయితే రిలీజ్ తేదీల ప‌రంగా ఇరువురి సినిమాల‌కు మ‌ధ్య క్లాష్ అంత‌గా ఉండ‌క‌పోవ‌చ్చు. ఒక‌ట్రెండు సినిమాలు క్లాష్ అయ్యేందుకు కూడా ఛాన్స్ ఉండొచ్చ‌ని అప్ప‌టి స‌న్నివేశాన్ని బ‌ట్టి అంతా మారుతుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు.

డుంకీ కోసం 500 మందితో రేస్ సీక్వెన్స్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ బిజీగా ఉంటూ తన తదుపరి రెండు ప్రాజెక్ట్ లు - జవాన్ .. డంకీని పూర్తి చేయడానికి వ‌రుస‌ షెడ్యూల్ లతో కుస్తీ ప‌డుతున్నాడు. గత వారంఅట్లీ కుమార్ దర్శకత్వంలోని 'జవాన్' కోసం 30 రోజుల షెడ్యూల్ ను ముగించిన తర్వాత చెన్నై నుండి ముంబైకి తిరిగి వచ్చాడు. లాంగ్ షెడ్యూల్ కారణంగా చెన్నైలోనే ఉండాల్సి వచ్చింది. ఈ వారాంతంలో ఖాన్ నేరుగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలోని 'డుంకీ' తదుపరి షెడ్యూల్ లో చేరాడు.

మిడ్-డేలో వచ్చిన తాజా నివేదిక ప్రకారం.. షారూఖ్‌- హిరాణీ జోడీ డుంకీ కోసం నైట్ షూట్ లతో బిజీగా ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున 500 మందితో రేస్ సీక్వెన్స్‌ను చిత్రీకరించార‌ని తెలిసింది. బోమన్ ఇరానీ కూడా రాత్రి షిఫ్ట్ లలో SRKతో షూటింగ్ చేస్తున్నాడు. భారీ సిబ్బందితో ఆదివారం ఉదయం చిత్రీకరణ చేశార‌ని స‌మాచారం. తారాగణం-సిబ్బంది ఉదయం 6-8 గంటల మధ్య షూట్ చేయాల్సి వ‌చ్చింది. ఉదయం 8 గంటలకు షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రానికి ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యాకప్ ఇస్తోంది.22 డిసెంబర్ 2023న పెద్ద స్క్రీన్‌పై విడుదల కానుంది. తాప్సీ పన్ను ఇందులో క‌థానాయిక‌. బొమన్ ఇరానీతో పాటు సతీష్ షా కూడా టీమ్ లో చేరారు. ఇది వలసలకు సంబంధించిన కథ. ఇప్పటికే ముంబై- బుడాపెస్ట్- లండన్ లలో డుంకీ చిత్రీకరణ జరిగింది.

షారుఖ్ ఖాన్ పఠాన్ చిత్రంతో ప్రారంభించి మూడు పెద్ద విడుదలలతో 2023ని క్లీన్ స్వీప్ చేయాల‌ని క‌సిగా ప‌ని చేస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 25న ప‌ఠాన్ థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె- జాన్ అబ్రహం నటిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అది కాకుండా జూన్ 2023లో అట్లీ 'జవాన్' లో కనిపిస్తాడు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి - నయనతార నటిస్తున్నారు. దీపిక అతిధి పాత్రలో నటిస్తుంద‌ని భావిస్తున్నారు. దీని తర్వాత డిసెంబర్ 2023లో రాజ్‌కుమార్ హిరానీ డుంకీ థియేట‌ర్ల‌లోకి వస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.