Begin typing your search above and press return to search.

ధ‌నుష్ తొలి తెలుగు సినిమాకు బిగ్ షాక్‌

By:  Tupaki Desk   |   25 Jan 2022 2:38 PM GMT
ధ‌నుష్ తొలి తెలుగు సినిమాకు బిగ్ షాక్‌
X
కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ త‌న భార్య ఐశ్వ‌ర్య‌కు విడాకులు ప్ర‌క‌టించిన వార్త‌ల్లో నిలిచారు. ఈ విష‌యం కార‌ణంగా గ‌త కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారిన ధ‌నుష్ తాజాగా మ‌రో సారి వార్త‌ల్లో నిలిచారు. అయితే ఈ సారి త‌ను తెలుగులో తొలిసారి చేస్తున్న సినిమాతో కావ‌డం గ‌మ‌నార్హం. విభిన్న‌మైన చిత్రాల‌తో హీరోగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని సొంతం చేసుకున్న ధ‌నుష్ న‌టిస్తున్న చిత్రం `స‌ర్‌`. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో తెర‌కెక్క‌తున్న ఈ మూవీ ఆదిలోనే ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ వార్త‌ల్లో నిలుస్తోంది.

యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరి తెర‌కెక్కిస్తున్న ఈ మూవీని సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యాన‌ర్ ల‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ, త్రివిక్ర‌మ్ వైఫ్ సాయి సౌజ‌న్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగులో `సార్‌`, త‌మిళంలో `వాతి` పేరుతో రూపొందుతున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ కోసం ఇటీవ‌లే హీరో ధ‌నుష్ హైద‌రాబాద్ కి వ‌చ్చేశారు.

ఈ మూవీ టైమ్ బాగున్న‌ట్టుగా లేదు. తాజాగా ఈ చిత్రానికి బిగ్ షాక్ త‌గిలింది. ఈ చిత్రానికి వ‌ర్క్ చేస్తున్న సినిమాటోగ్రాఫ‌ర్ ఉన్న‌ట్టుండి ఈ మూవీ నుంచి తాను త‌ప్పుకుంటున్నాన‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఈ చిత్రానికి దినేష్ కృష్ణ‌న్ సినిమాటోగ్రాఫ‌ర్ గా వ్య‌వ‌హ‌రించాలి. ఈ మూవీ ప్ర‌క‌టించిన సంద‌ర్భంలోనే మేక‌ర్స్ మోష‌న్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసి అందులో టెక్నిషియ‌న్ ల‌ని కూడా ప‌రిచ‌యం చేశారు.

అయితే ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ ఈ చిత్రం నుంచి సినిమాటోగ్రాఫ‌ర్ దినేష్ కృష్ణ‌న్ తాను త‌ప్పుకుంటున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. అని వార్య కార‌ణాల వ‌ల్ల తాను ఈ సినిమా నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని, అయితే త్వ‌ర‌లోనే సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యాన‌ర్ ల‌లో సినిమా చేస్తాన‌ని దినేష్ కృష్ణ‌న్` వెల్ల‌డించ‌డంతో ఆయ‌న స్థానంలో సినిమాటోగ్రాఫ‌ర్ గా మ‌ళ్లీ ఎవ‌రిని టీమ్ లోకి తీసుకుంటారా? అని చ‌ర్చ జ‌రుగుతోంది.

పిరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ మూవీలో హీరో ధ‌నుష్ కాలేజీ లెక్చ‌ర‌ర్ గా క‌నిపించ‌బోతున్నారు. ఉన్న‌త‌మైన ల‌క్ష్యంతో ఓ సామాన్యుడు లెక్చ‌ర‌ర్ గా మారిన విధానాన్ని ఈ చిత్రంలో చూపించ‌బోతున్నారు. స‌రికొత్త నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి జీవీకె ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తుండ‌గా, న‌వీన్ నూలి ఎడిట‌ర్ గా వ‌ర్క్ చేస్తున్నారు.