Begin typing your search above and press return to search.

బెల్లంకొండ పంచాయితీ తప్పట్లేదుగా..

By:  Tupaki Desk   |   14 April 2015 8:36 AM GMT
బెల్లంకొండ పంచాయితీ తప్పట్లేదుగా..
X
బెల్లంకొండ సురేష్‌ అంటేనే వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఆయన సినిమాలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో ఎప్పుడూ ఏదో ఒక పేచీ మామూలే. ఫైనాన్షియర్లతో ఆయనకు గొడవలు ఈనాటివి కావు. బెల్లంకొండ బేనర్లో వస్తున్న కొత్త సినిమా 'గంగ: కాంఛన 2' విషయంలోనూ ఫైనాన్స్‌ పంచాయితీ తప్పేట్లు లేదంటున్నారు. ఈ సినిమాను అనుకున్నట్లే ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రావడం డౌటే అని కూడా అంటున్నారు. 'గంగ'కు సంబంధించి రెండు కోట్ల రూపాయల లావాదేవీ విషయంలో ఓ ఫైనాన్షియర్‌తో బెల్లంకొండ సురేష్‌కు పితలాటకం నడుస్తోందని.. ఆ విషయం ఎంతకీ తేలట్లేదని సమాచారం.

ఇంతకుముందు అల్లుడు శీను, రభస సినిమాల విడుదల సమయంలో ఫైనాన్షియర్లు, బయ్యర్లతో బెల్లంకొండకు వివాదం నడిచిందన్న వార్తలు వినిపించాయి అప్పట్లో. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన కొడుకు శ్రీనివాస్‌తో తీయాల్సిన భారీ బడ్జెట్‌ సినిమా ఆగిపోవడానికి కూడా ఈ వివాదాలే కారణం. అందుకే 'గంగ' విషయంలో సందడేం చేయట్లేదు బెల్లంకొండ. ఆ సినిమాతో తనకు సంబంధం లేనట్లుగా ఉంటున్నారు. ప్రమోషనే లేదు. చడీచప్పుడు లేకుండా సినిమాను విడుదల చేసి వ్యవహారం ఆ తర్వాత చక్కదిద్దుకుందామనుకున్నాడో ఏంటో కానీ.. బెల్లంకొండకు తలనొప్పి మాత్రం తప్పట్లేదు. ఐతే ఎలాంటి వివాదం వచ్చినా.. ఏదో ఒకటి మేనేజ్‌ చేసి సినిమా సజావుగా విడుదలయ్యేలా చూడటం బెల్లంకొండకు కొత్తేం కాదు. చూద్దాం ఏమవుతుందో.