Begin typing your search above and press return to search.

బాలు లేడు.. కానీ ఆయ‌న కొత్త పాట వ‌స్తోంది

By:  Tupaki Desk   |   2 Oct 2021 3:30 AM GMT
బాలు లేడు.. కానీ ఆయ‌న కొత్త పాట వ‌స్తోంది
X
గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి అప్పుడే ఏడాది దాటిపోయింది. బాలు అభిమానులు త‌న‌ పాట‌లు వింటూ ఆయ‌న లేని లోటును మ‌రిచిపోయే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. త‌న‌ పాట‌ల ద్వారా ఆయ‌న ఎప్ప‌టికీ జీవించి ఉంటాడ‌న‌డంలో సందేహం లేదు. ఇటీవ‌లే బాలు ప్ర‌థ‌మ వ‌ర్ధంతి సంద‌ర్భంగా అభిమానులు మ‌రోసారి ఆయ‌న్ని త‌లుచుకుని ఆవేద‌న‌లో మునిగిపోయారు. ఇలాంటి స‌మ‌యంలో బాలు అభిమానుల‌ను ఉద్వేగానికి గురి చేసే ఓ వార్త బ‌య‌టికి వ‌చ్చింది. బాలు చ‌నిపోయిన ఏడాది తర్వాత ఆయ‌న పాడిన కొత్త పాట ఒక‌టి రిలీజ్ కాబోతోంది. అది సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ సినిమాలోనిది కావ‌డం విశేషం.

ర‌జినీ నుంచి త్వ‌ర‌లోనే అన్నాత్తె అనే సినిమా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. శౌర్యం, వీరం, వేదాళం, విశ్వాసం లాంటి సినిమాలు తీసిన శివ రూపొందించిన చిత్ర‌మిది. దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్లు మొద‌లుపెడుతోంది టీం. ముందుగా ఈ సినిమా నుంచి తొలి పాట‌ను రిలీజ్ చేస్తున్నారు. ఆ పాట పాడింది బాలునే కావ‌డం విశేషం. త‌న సినిమాల్లో ఇంట్రో సాంగ్‌ను బాలుతో పాడించుకోవ‌డం ర‌జినీకి అల‌వాటు. ఇలా ఎన్నో సినిమాల‌కు బాలు పాట పాడారు. ర‌జినీ చివ‌రి రెండు సినిమాలు ద‌ర్బార్, పేటల్లోనూ ఇంట్రో సాంగ్స్ బాలు పాడిన‌వే. అన్నాత్తెకు కూడా ఈ సంప్ర‌దాయాన్ని కొన‌సాగించారు. బాలు జీవించి ఉండగానే ఈ పాట రికార్డింగ్ పూర్త‌యింది. అన్నాత్తె సినిమాను ఏడాదిన్న‌ర కింద‌టే మొద‌లుపెట్టారు. సినిమా ఆరంభ ద‌శ‌లోనే బాలుతో పాట కూడా రికార్డ్ చేయించారు. కానీ క‌రోనా కార‌ణంగా సినిమా ఆల‌స్యం అయింది. ఈలోపు బాలు కూడా ఆ మ‌హ‌మ్మారి బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయారు. అక్టోబ‌రు 4న సాయంత్రం 6 గంట‌ల‌కు ఈ పాట రిలీజ్ కానుంది. ఈ స‌మాచారం బ‌య‌టికి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి బాలు అభిమానులు ఉద్వేగానికి గుర‌వుతున్నారు. మ‌రి బాలు చివ‌రి పాట ఎలా ఉంటుందో చూడాలి.