Begin typing your search above and press return to search.

బాలయ్య అభయం ఇచ్చారట.. దిగుల్లేదిక!

By:  Tupaki Desk   |   13 Feb 2019 2:33 PM GMT
బాలయ్య అభయం ఇచ్చారట.. దిగుల్లేదిక!
X
'ఎన్టీఆర్ కథానాయకుడు' బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ గా నిలవడంతో సినిమాను పంపిణీ చేసిన బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లందరూ నష్టాల పాలయ్యారు. మిగతా ఫ్లాప్ సినిమాల మాదిరిగా కాకుండా ఈ సినిమాకు నష్టాల శాతం ఎక్కువగా ఉండడంతో బయ్యర్లు తమ పరిస్థితి ఏంటనే ఆందోళనలో ఉన్నారు. ఇక రెండవ భాగం 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమా త్వరలో రిలీజ్ కానుండండంతో మొదటి భాగం వల్ల నష్టపోయిన బయ్యర్లకు సంబంధించి పలు రకాల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. వీటిలో ఎంతమాత్రం నిజముందనే విషయం చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు.

ఈ విషయంపై ఎన్టీఆర్ బయోపిక్ టీమ్ అధికారికంగా వివరణ ఇచ్చింది. 'ఎన్టీఆర్ కథానాయకుడు' బయ్యర్లు.. డిస్ట్రిబ్యూటర్లకే 'ఎన్టీఆర్ మహానాయకుడు' డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇవ్వాలని నందమూరి బాలకృష్ణ నిర్ణయం తీసుకున్నారట. అంతే కాదు.. 'కథానాయకుడు' సినిమాతో వారికి వాటిల్లిన నష్టాలలో 1/3 వంతు వరకూ తీరుస్తానని మాటిచ్చారట. ఇది మాత్రమేకాకుండా 'ఎన్టీఆర్ మహానాయకుడు' పై వచ్చే ఆదాయంలో 40 % వరకూ బయ్యర్ల నష్టాలను తీర్చడానికి వినియోగిస్తామని చెప్పారట. దీంతో బయ్యర్లు నష్టపోయిన ప్రతి ఒక్క రూపాయ కూడా వారికి వెనక్కు వచ్చినట్టు అవుతుంది.

సినిమాలు ఒక్కోసారి ఫ్లాప్ కావడం.. బయ్యర్లు తీవ్ర నష్టాల పాలవ్వడం సహజంగా జరిగేదే కానీ ఇలా బయ్యర్లను ఆదుకునేందుకు పూర్తి స్థాయిలో నిర్మాత ముందుకు రావడం ఇప్పటివరకూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జరగలేదు. ఒక రకంగా ఈ విషయంలో బాలయ్యబాబు సంచలనం సృష్టించినట్టే. బాలయ్య హామీ విషయం తెలిసిన బయ్యర్లు.. డిస్ట్రిబ్యూటర్లు ఒక్కసారి ఊపిరి పీల్చుకోవడమే కాకుండా బాలయ్యబాబును సూపర్ అంటున్నారట. ఇదిలా ఉంటే 'ఎన్టీఆర్ మహానాయకుడు' ఫిబ్రవరి 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.