Begin typing your search above and press return to search.

చిరంజీవిని ఉద్దేశించే బాలయ్య ఆ కామెంట్స్ చేశారా...?

By:  Tupaki Desk   |   9 Jun 2020 1:30 PM GMT
చిరంజీవిని ఉద్దేశించే బాలయ్య ఆ కామెంట్స్ చేశారా...?
X
ఇటీవల సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. ఇండస్ట్రీ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసుకుని తనని పిలవలేదని అసహనానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలో కొంతమంది భూములు పంచుకుంటున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. బాలయ్య ఇండైరెక్టుగా చిరంజీవిని అన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో చాలామంది అనుకున్నారు. కాగా తాజాగా బాలయ్య ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి చిరంజీవి గతంలో చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించేలా కొన్ని కామెంట్స్ చేసారు. గతంలో చిరంజీవి - రాజశేఖర్ మధ్య 'మా' మీటింగ్ లో వివాదం తలెత్తిన సందర్భంలో "మంచి మైకులో చెప్పాలి.. చెడు చెవిలో చెప్పాలి" అంటూ చిరు వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు బాలయ్య యాంకర్ ప్రస్తావించిన ఈ మాటలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ "చెడు చెవి లో చెప్పాలా.. మంచి మైకులో చెప్పాలా.. ఎందుకు.. చెవిలో చెడు చెబితే ఏం వస్తుంది.. అంతర్మథనం పొందడం తప్ప. వాడు చెడు చేశాడు కాబట్టి మనం తిడతాం. ఆ మాటలతో వాడు బాగుపడ్డాడనే తృప్తి ఉంటుంది. అది కూడా ఓ విధంగా సేవ చేసినట్లే కదా. చెడు చెవిలో చెప్పడానికి నేనన్న మాట ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. ఒకరి పేరు నేను చెప్పలేదు కదా. అందర్నీ కలిపి అన్నాను. ఇండస్ట్రీ ఏ ఒక్కడి సొత్తు కాదు. సొమ్ము కాదు. ఇండస్ట్రీ అందరిదీ. కొందరు మనకెందుకులే అని సైలెంటు గా ఉండే వారు ఉంటారు. కానీ నేను ఇండస్ట్రీలో వాడిని కాబట్టి నాకు అక్కడ జరిగేవి తెలియాలి" అని చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా భూములు పంచుకున్నారన్న మాటలకు కట్టుబడి ఉన్నానని.. నేను ఎమోషనల్ మనిషినని అందరికీ తెలుసు.. అయినా నేను వ్యాఖ్యలు నాకై నేను ఎవరితో చెప్పలేదు. మీడియా వారు అడిగితేనే బయటకు చెప్పాను. నా స్వభావం అలాంటిది. ఎవరైనా సరే నాకు మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోవాలి. నాకు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడటం తెలియదు అని పేర్కొన్నారు బాలయ్య. దీంతో బాలయ్య చిరంజీవి పై మరోసారి పంచ్ వేశారంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఇండస్ట్రీలో దాసరి లేని లోటు కనిపిస్తుందా అని అడుగగా.. ''దాసరి లేని లోటు తెలుస్తోంది. ఆయన స్థానాన్ని ఎవ్వరూ ఒక్క శాతం కూడా భర్తీ చేయలేక పోతున్నారు. ఆయన శిష్యుడు కల్యాణ్ మాత్రం ఉన్నంతలో చేస్తున్నారు. గురువుగారి పేరు నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతే ఇంకెవరూ లేరు'' అని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు కూడా మెగాస్టార్ ని ఉద్దేశించే బాలయ్య చేశారని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల చిరంజీవి ఇండస్ట్రీ విషయాల్లో ముందుంటూ.. సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. కరోనా వలన ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికుల కోసం ఛారిటీ ఏర్పాటు చేసి స్వయంగా వాటి పనులు చూసుకున్నాడు. అంతే కాకుండా షూటింగులకు అనుమతి ఇవ్వాలంటూ పలు సమావేశాలు నిర్వహించి పర్మిషన్ రావడానికి ప్రయత్నాలు చేసారు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దగా చిరు అన్నిటికి ముందుండి నడిపించడంతో బాలయ్య ఈ కామెంట్స్ చేసారని వారు అనుకుంటున్నారు.