Begin typing your search above and press return to search.

బాల‌య్య ఫ్యాన్స్ కు డ‌బుల్ టెన్ష‌న్

By:  Tupaki Desk   |   11 March 2020 4:38 AM GMT
బాల‌య్య ఫ్యాన్స్ కు డ‌బుల్ టెన్ష‌న్
X
ఎవరు చెప్పినా వినడు.. ఎంత చెప్పినా వినడు.. వినాల్సింది విని తాను అనుకున్నదే చేస్తాడు. ఈ ధోరణి ఆయన వ‌రుస‌ ఫెయిల్యూర్స్ కి కార‌ణం అన్న గుస‌గుస‌లు ఉన్నాయి. అయితేనేం ఆయ‌నేమైనా మారారా? అంటే అందుకు ఛాన్సే లేదంటూ ఫ్యాన్స్ లోనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. నేటిత‌రం హీరోలంతా నవతరం దర్శకుల వైపు చూస్తున్నారు. కొత్త ఆలోచనల‌తో.. మూస ధోరణికి భిన్నంగా సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతున్నారు. కానీ బాలకృష్ణ మాత్రం ఇప్పటికీ మారడం లేదు. ఇంకా సీనియర్‌ దర్శకులు.. ఔట్‌ డేటెడ్‌ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తున్నార‌న్న విమ‌ర్శ అలానే ఉంది. మార్పు లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే వరుసగా ఫ్లాప్ లు ఆయన్ని ముద్దాడుతున్నాయని విమ‌ర్శిస్తున్నారంతా. ఇక‌నైనా మారతారా? అంటే స‌సేమిరా అనే స‌మాధానం వ‌స్తోందిట‌. తాను న‌మ్మే ద‌ర్శ‌కుల‌కే అవ‌కాశాలిస్తున్నారు.

ఇటీవల ఎన్.బీ.కే కెరీర్ సంగ‌తి చూస్తే.. ఆయన చేసిన సినిమాలన్నీ సీనియర్‌ దర్శకులతోనే కావడం విశేషం. క్రిష్ తో గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత పూరీ జగన్నాథ్ తో పైసా వసూల్‌.. కె.ఎస్‌.రవికుమార్ తో వరుసగా జై సింహా- రూలర్‌- క్రిష్ తో ఎన్టీఆర్‌ బయోపిక్ లు చేశారు. ఇవన్నీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. తాజాగా సింహా- లెజెండ్‌ తర్వాత బోయపాటి శ్రీనుతో కలిసి హ్యాట్రిక్‌ కోసం మూడో సినిమా చేస్తున్నారు. ఇటీవలే రెగ్యులర్‌ షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇందులో అంజలి.. శ్రియా కథానాయికలుగా నటించే ఛాన్స్ ఉందట. ఇది బాలకృష్ణ నటిస్తున్న 106వ చిత్రం. మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి పై క్రిటిక్స్ విమ‌ర్శ‌ల దృష్ట్యా.. ఈసారి త‌న‌కి హిట్‌ ఇస్తాడా? లేదా! అన్న ఆందోళన బాలయ్యలో మొద‌లైంద‌న్న గుస‌గుసా వినిపిస్తోంది.

ఇలాంటి టైమ్ లో మ‌రో ఊహించ‌ని ట్విస్టు ఎన్‌.బీ.కే లైఫ్ లో ప్ర‌వేశించింద‌ట‌. ఆయన 107వ సినిమాని కూడా ఫైనల్ చేసేయడంపై ర‌క‌ర‌కాల‌ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తనకు వరుసగా విజయాలను అందించి మాస్‌ హీరోగా నిలబెట్టిన బి.గోపాల్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఎన్.బీ.కే సిద్ధమవుతున్నారట. ఈ కాంబినేషన్ లో ఇప్పటికే లారీ డ్రైవర్‌- రౌడీ ఇన్‌స్పెక్టర్‌- సమరసింహారెడ్డి, నరసింహానాయుడు- పల్నాటి బ్రహ్మనాయుడు వంటి భారీ యాక్ష‌న్ చిత్రాలు వచ్చి విజయాలను సాధించాయి. కానీ పల్నాటి బ్రహ్మనాయుడు తర్వాత బి.గోపాల్‌ చేసిన సినిమాలేవీ సక్సెస్‌ కాలేదు. ఓ రకంగా ఆయన నేటి ట్రెండ్ ని పట్టుకోలేకపోవడం వ‌ల్ల‌నే ఫెయిల్యూర్స్ వచ్చాయనే కామెంట్‌ వినిపించింది. ఇప్పుడంతా నవ్యరీతుల్లో ఉండే కథలను ఎంచుకుని హిట్‌ కొడుతున్న నేపథ్యంలో ఇంకా మూస ధోరణిలో సాగే కథలతో సినిమాలు చేస్తామంటే చూసేందుకు ఆడియెన్స్ భ‌రించ‌డం క‌ష్ట‌మే. దీంతో బాలకృష్ణ తన తదుపరి సినిమా బి.గోపాల్ తో చేయబోతున్నారనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బోయపాటి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న ఆందోళనలో ఉన్న ఫ్యాన్స్ కి బాలయ్య మరో టెన్షన్‌ తెచ్చిపెట్టాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.