Begin typing your search above and press return to search.

చిరు.. బాలయ్యల ఫ్లెక్సీల్ని చించేశారు

By:  Tupaki Desk   |   16 Jan 2017 9:25 AM GMT
చిరు.. బాలయ్యల ఫ్లెక్సీల్ని చించేశారు
X
హీరోలేమో మేం మేం స్నేహితులం అంటారు. కానీ అభిమానులు మాత్రం బద్ధ శత్రువల్లా మెలుగుతారు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి.. నటసింహా బాలకృష్ణల ప్రెస్టీజియస్ మూవీస్ రిలీజ్ సందర్భంగా ఇరువురి అభిమానులూ హద్దులు దాటారు. ఒకరి మీద ఒకరు విషం చిమ్ముకున్నారు. ఇక్కడ రాజకీయాల ప్రభావం కూడా కనిపించి అభిమానుల మధ్య ద్వేషం మరింత పెరిగిపోయింది. తాజాగా కడప జిల్లా పులివెందులలో.. కృష్ణా జిల్లా కైకలూరులో జరిగిన పరిణామాలు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి.

పులివెందులలోని లక్ష్మి థియేటర్‌ లో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చిత్రాన్ని ప్రదర్శిస్తుండగా.. ఆదివారం సెకండ్ షో ముగిశాక అర్ధరాత్రి ఒంటిగంటకు గుర్తు తెలియని వ్యక్తులు థియేటర్ ఆవరణలోకి చొరబడి అక్కడ బాలయ్య అభిమానులు ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలను చించేశారు. ఉదయానికల్లా ఈ వార్త పులివెందులలో కలకలం రేపింది. నందమూరి అభిమానులు థియేటర్ వద్దకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఏఎస్పీ దృష్టికి విషయం తీసుకెళ్లారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థియేటర్లో ఉన్న సీసీ టీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాటిలో స్పష్టత లేకపోవడంతో హైదరాబాద్ కు పంపించినట్లు చెప్పారు. బాలయ్య ఫ్లెక్సీలు చింపడం నీచమైన చర్య అని.. ఈ పని ఎవరు చేశారో తమకు తెలుసని తెలుగుదేశం నేత.. శాసనమండలి డిప్యూటి చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు.

మరోవైపు కైకలూరులో చిరంజీవితో పాటుగా దివంగత కాపు నేత వంగవీటి రంగా ఫ్లెక్సీలను చించేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది. దీంతో చిరంజీవి.. రంగా అభిమానులు రోడ్డుపై బైఠాయించి రాకపోకల్ని అడ్డుకుున్నారు. భీమవరం మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు వచ్చినా పరిస్థితిని అదుపులోకి తేలేకపోయారు. అభిమానులు ఆందోళన విరమించలేదు. ఆందోళనకారులు ర్యాలీగా కైకలూరు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. సీసీ టీవీ ఫుటేజీల్ని పరిశీలించి ఈ పని ఎవరు చేశారో తెలుసుకుంటామంటూ పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. అభిమానులు వినలేదు. ఆందోళన కొనసాగించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/