Begin typing your search above and press return to search.

రష్మిక లోక్ సభ ఎంపీ అవుతుందా..?

By:  Tupaki Desk   |   14 Sep 2022 4:55 AM GMT
రష్మిక లోక్ సభ ఎంపీ అవుతుందా..?
X
టాలీవుడ్ మోస్ట్ డిమాండబుల్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. 'ఛలో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ లక్కీ బ్యూటీ.. అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం చేతి నిండా క్రేజీ ప్రాజెక్ట్స్ తో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతోంది. అయితే సెలబ్రిటీ జ్యోతిష్కుడిగా పాపులర్ అయిన వేణు స్వామి.. ఇటీవల రష్మిక భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జ్యోతిష్యుడు వేణు స్వామి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రష్మిక మందన్నా రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి అడుగుపెడుతుందని జోస్యం చెప్పారు. కర్ణాటక రాష్ట్రం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుందని ఆమె జాతకం చెబుతోందని తెలిపారు. కన్నడ హీరోయిన్ రమ్య మాదిరిగానే రష్మిక కూడా ఎంపీ అయ్యే అవకాశం ఉందని చెప్పారు.

భవిష్యత్ లో కచ్చితంగా లోక్ సభ ఎంపీ అవుతారని రష్మిక కు చెప్పినట్లు వేణు స్వామి తెలిపారు. గతంలో హైదరాబాద్ లోని రష్మిక ఇంట్లో యాగం చేసిన విషయాన్ని కూడా ఆయన వెల్లడించారు. ఆమె కోసం రాజశ్యామల - తార పూజలు చేశానని చెప్పిన జ్యోతిష్యుడు.. తన మాజీ బాయ్ ఫ్రెండ్ రక్షిత్ శెట్టి తో విడిపోయిన తర్వాత జాతకం బాగుంటుందని రష్మీకతో చెప్పినట్లు తెలిపారు.

రక్షిత్ శెట్టి - రష్మిక ఎంగేజ్మెంట్ జరిగిన తరువాత వారి జాతకాలు చూసి.. ఆ అబ్బాయిని వదిలేయండి అని ఆమెతో చెప్పాను. నేను చెప్పినట్లుగానే అతన్ని వదిలేసింది. ఆ తర్వాత పూజలు చేసి ఎవ్వరూ ఊహించనటువంటి రేంజ్ కు వెళ్తారని అన్నాను. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందో మీరే చూస్తున్నారు. నేషనల్ క్రష్ అనిపించుకుంది. సినిమాకు ఆరేడు కోట్లు తీసుకుంటోంది అని వేణు స్వామి చెప్పుకొచ్చారు.

అక్కినేని నాగ చైతన్య - సమంతల విడాకుల గురించి చాలా ముందుగానే ఊహించి వేణు స్వామి బాగా పాపులర్ అయ్యాడు. అప్పటి నుంచి అందరు సెలబ్రిటీలపై కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ జాతకంలో నాలుగో పెళ్లి ఉందంటూ పవర్ స్టార్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇప్పుడు రష్మిక మందన్నా పాలిటిక్స్ లోకి వెళ్తుందని అంటున్నాడు.

సినీ ఇండస్ట్రీకి రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉందనే విషయం తెలిసిందే. సినిమా నటీనటులు పాలిటిక్స్ లోకి వెళ్లడం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అనేకమంది ప్రజల మద్దతుతో గెలిచి అసెంబ్లీ - పార్లమెంట్ లలో అడుగుపెట్టారు. మరికొందరు నామినేటెడ్ ఎంపీలుగా రాజ్యసభలో అడుగుపెట్టారు. కేంద్ర మంత్రులు కూడా అయ్యారు. మరి వేణు స్వామి చెప్పినట్లు రష్మిక కూడా భవిష్యత్ లో రాజకీయాల్లోకి అడుగు పెడుతుందేమో చూడాలి

ఇక సినిమాల విషయానికొస్తే.. రష్మిక ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ తో కలిసి 'గుడ్ బై' చిత్రంలో నటిస్తోంది. అలానే 'మిషన్ మజ్ను' సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. 'యానిమల్' మూవీలో రణబీర్ కపూర్ కు జోడీగా కనిపించనుంది రష్మిక.

అల్లు అర్జున్ హీరోగా రూపొందనున్న 'పుష్ప: ది రూల్' సినిమాలోనూ రష్మిక హీరోయిన్ గా కొనసాగనుంది. ఇక విజయ్ హీరోగా నటిస్తున్న 'వారసుడు' అనే తెలుగు తమిళ ద్విభాషా చిత్రంలో లక్కీ బ్యూటీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.