Begin typing your search above and press return to search.

సాయిధరమ్ నిన్న మా ఇంటికొచ్చి వెళ్లాడు.. కౌన్సిలింగ్ ఇద్దమనుకున్నా: నరేశ్

By:  Tupaki Desk   |   11 Sep 2021 9:19 AM GMT
సాయిధరమ్ నిన్న మా ఇంటికొచ్చి వెళ్లాడు.. కౌన్సిలింగ్ ఇద్దమనుకున్నా: నరేశ్
X
రోడ్డు ప్రమాదం జరగడానికి ముందు సాయిధరమ్ తేజ్ తన ఇంటి నుంచే బయలుదేరాడని సీనియర్ నటుడు నరేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ కు సాయితేజ్ మంచి స్నేహితుడు అని వివరించారు. సాయిధరమ్ తేజ్ వేగంగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుడిని కోరుకుంటున్నట్లు నరేశ్ తెలిపారు.

తాజాగా ఈ మేరకు నరేశ్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అందులో ఆయన ఏమన్నాడంటే.. 'సాయిధరమ్ తేజ్ నా బిడ్డ లాంటివాడు. తను కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. నా కుమారుడు నవీన్ విజయకృష్ణ-సాయిధరమ్ మంచి స్నేహితులు. అన్నాదమ్ముళ్లా ఉంటారు. నిన్న సాయంత్రం వాళ్లిద్దరూ ఇక్కడి నుంచే బయలు దేరారు. బైక్ పై స్పీడుగా వెళ్లొద్దని చెప్పాలనుకొని బయటకు వచ్చేసరికే వాళ్లు బయలుదేరిపోయారు. ' అని నరేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

నాలుగురోజుల క్రితమే వీళ్లిద్దరికీ కౌన్సెలింగ్ ఇవ్వాలనుకున్నానని.. కానీ కుదరలేదని నరేశ్ వివరించారు. పెళ్లి-కెరీర్ తో జీవితంలో సెటిల్ కావాల్సిన వయసు ఇది. ఇలాంటి సమయంలో ఈ విధమైన రిస్క్ లు తీసుకోకుండా ఉండటమే మంచిదని నరేశ్ అన్నారు.

'గతంలో నేను కూడా బైక్ డ్రైవింగ్ కు వెళ్లి ప్రమాదానికి గురయ్యాను. మా అమ్మ ఒట్టు వేయించుకోవడంతో ఆ నాటి నుంచి బైక్స్ జోలికి పోలేదు.' అని నరేశ్ పాత సంగతులు గుర్తు చేశాడు.

సాయిధరమ్ తేజ్ ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించాలనుకున్నాను. కాకపోతే పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లలేకపోయాను.. త్వరలోనే కలుస్తాను' అని నరేశ్ వివరించారు.