Begin typing your search above and press return to search.

ఆ సినిమాతో రెండు బ్యానర్ల ఫేట్ మారేనా?

By:  Tupaki Desk   |   12 April 2020 3:30 AM GMT
ఆ సినిమాతో రెండు బ్యానర్ల ఫేట్ మారేనా?
X
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇప్పటివరకు చాలా సినిమాలు నిర్మించింది. అయితే వీటిలో సోలో సినిమాలేవీ లేవు. దాదాపుగా అన్నీ ఇతర బ్యానర్ల భాగస్వామ్యంతో నిర్మించిన సినిమాలే. అదేం దురదృష్టమో కానీ ఈ బ్యానర్లో తెరకెక్కిన సినిమాలేవీ భారీ విజయాలు సాధించలేకపోయాయి. కొన్ని సినిమాలు బ్రేక్ ఈవెన్ మార్క్ వరకు వచ్చాయి. దీంతో ఆ డబ్బు రొటేషన్ వరకు సరిపోతుంది.

ఇలానే పయనం సాగిస్తున్న మరో టాలీవుడ్ బ్యానర్ అభిషేక్ పిక్చర్స్. ఈ బ్యానర్ వారు సినిమాలను అవుట్ రైట్ గా కొనేస్తుంటారు. సినిమా ట్రైలర్ బాగుంటే చాలు.. సినిమాను చూడకుండానే అవుట్ రైట్ గా ఒక రేటు ఆఫర్ చేయడం.. ఆ సినిమాను కొనేయడం అభిషేక్ కు అలవాటుగా మారింది. అయితే అభిషేక్ ఇలా ట్రైలర్లు చూసి కొన్న సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం పాలయ్యాయి. అభిషేక్ పిక్చర్స్ కు తీవ్ర నష్టాలు మిగిల్చాయి. అభిషేక్ పిక్చర్స్ వారు అవుట్ రైట్ గా సినిమాలు కొనడమే కాదు.. కొందరు యువ హీరోలకు గతంలో అడ్వాన్స్ ఇచ్చారు. దీంతో ఆ హీరోలతో ప్రస్తుతం సినిమాలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. లేదా ఆ హీరో లైన్ లో పెట్టిన సినిమాలకు భాగస్వాములుగా చేరి కాలం వెళ్లదీస్తున్నారు.

పైన చెప్పుకున్న రెండు బ్యానర్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. అభిషేక్ పిక్చర్స్ కలిసి ప్రస్తుతం 'కార్తికేయ 2' సినిమాను నిర్మిస్తున్నాయి. నిఖిల్ హీరోగా.. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అటు ప్రేక్షకులతో పాటు ఇటు ట్రేడ్ వర్గాల లోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాతో ఈ రెండు బ్యానర్లకు కమర్షియల్ సక్సెస్ లభిస్తుందా? ఇతర విజయవంతమైన బ్యానర్ల తరహాలో వీరు కూడా మంచి పేరు తెచ్చుకుంటారా అనేది వేచి చూడాలి.