Begin typing your search above and press return to search.

అరవింద్ స్వామి కొత్త అవతారం

By:  Tupaki Desk   |   11 May 2018 5:40 AM GMT
అరవింద్ స్వామి కొత్త అవతారం
X
‘రోజా’.. ‘బొంబాయి’ లాంటి సినిమాలతో తొంభైల్లో అమ్మాయిలకు కలల రాకుమారుడిగా మారిపోయాడు అరవింద్ స్వామి. గంగిగోవు పాలు గరిటడైనా చాలు అన్నట్లుగా.. అతను చేసింది చాలా తక్కువ సినిమాలే కానీ.. అవి ఒక్కొక్కటి ఒక్కో క్లాసిక్ లాగా నిలిచిపోయాయి. తనకు మాంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఇబ్బడిముబ్బడిగా సినిమాలు చేసేయాలని అతను వెంపర్లాడలేదు. పట్టుమని పది సినిమాలు చేసి సినీ రంగం నుంచి నిష్క్రమించాడు. దశాబ్దానికి పైగా అరవింద్ స్వామి అనేవాడి జాడే లేదు. అతడి గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ‘కడలి’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి ‘తనీ ఒరువన్’ (తెలుగులో ధృవ) మెస్మరైజింగ్ పెర్ఫామెన్స్ తో తనేంటో చాటి చెప్పాడు. ఆ సినిమా తర్వాత తమిళంలో ఫుల్ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం అతడి చేతిలో అరడజను దాకా సినిమాలున్నాయి.

తమిళంలో ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అరవింద్.. త్వరలోనే కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. మెగా ఫోన్ పట్టబోతున్నాడు. తాను దర్శకుడిగా మారనున్నట్లు అరవింద్ స్వయంగా వెల్లడించాడు. ఈ సినిమాకు స్క్రిప్టు దాదాపుగా సిద్ధమైందని.. నిర్మాత కూడా రెడీ అని.. ఈ సినిమా పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని అరవింద్ చెప్పాడు. మణిరత్నం సహా గొప్ప గొప్ప దర్శకులతో పని చేసిన అనుభవమే తనకు పాఠాలని.. దర్శకుడిగా తన తొలి సినిమాను ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటానని అరవింద్ అంటున్నాడు. నటుడిగా తాను ఎంచుకున్న సినిమాలతో అభిరుచిని చాటుకున్న అరవింద్.. దర్శకుడిగా ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి. ప్రస్తుతం అరవింద్ మణిరత్నం దర్శకత్వంలో ‘చెక్క చివంత వానం’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది.