Begin typing your search above and press return to search.

చిరంజీవి ట్వీట్ పై ఏపీ మంత్రి స్పందన..!

By:  Tupaki Desk   |   26 Nov 2021 5:30 AM GMT
చిరంజీవి ట్వీట్ పై ఏపీ మంత్రి స్పందన..!
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరిన సంగతి తెలిసిందే. శాసనసభలో ఇటీవల ప్రవేశ పెట్టిన సినిమాటోగ్రఫీ బిల్లు గురించి ట్వీట్ చేస్తూ టికెట్ ధరలపై కొన్ని సూచనలు చేశారు. దేశమంతా ఒకటే జీఎస్టీగా ప్రభుత్వాలు పన్నులు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరల్లో అదే వెసులుబాటు ఉండటం సమంజసమని.. ఈ విషయమై పునరాలోచించాలని ముఖ్యమంత్రిని కోరారు.

ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని స్వాగతించిన చిరు.. ప్రభుత్వాల ప్రోత్సాహం ఉన్నప్పుడే చిత్ర పరిశ్రమ నిలదొక్కుకుంటుందని చిరంజీవి పేర్కొన్నారు. చిరు ట్వీట్ పై తాజాగా ఏపీ సమాచార మంత్రి పేర్ని నాని స్పందించారు. సినిమా టిక్కెట్ల అంశంపై చిరంజీవి అభిప్రాయాన్ని చర్చిస్తామని.. సీఎంతో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని మినిస్టర్ స్పష్టం చేశారు.

''సినిమా టికెట్ రేట్ల విషయంలో పునరాలోచించుకోవాలని చిరంజీవి గారితో పాటుగా ప్రొడ్యూసర్స్ డిస్ట్రిబ్యూటర్స్ కొంతమంది ఎగ్జిబిటర్స్ ఏపీ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏదైనా చేస్తానని.. సీఎం దృష్టికి తీసుకెళ్తానని నేను ఇప్పటికే చెప్పాను. ప్రస్తుతం అసెంబ్లీ హడావిడిలో ఉన్నారు కాబట్టి సమయం చూసుకొని సినీ ప్రముఖుల విన్నపం గురించి మళ్ళీ ముఖ్యమంత్రితో మాట్లాడతాను. సినిమాటోగ్రఫీ యాక్ట్ సీఎం గారి దగ్గరే ఉంది కాబట్టి అంతిమ నిర్ణయం వారే తీసుకోవాలి. సమయం చూసుకొని ప్రతి సమస్య గురించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానని నాతో మాట్లాడుతున్న ప్రొడ్యూసర్స్ హీరోలకు చెప్పాను'' అని పేర్ని నాని అన్నారు.

చిరంజీవి గురువారం ట్వీట్ చేస్తూ.. ''పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. అదే విధంగా థియేటర్ల మనుగడ కోసం, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాలు బతుకు తెరువు కోసం తగ్గించిన టికెట్ ధరల్ని కాలానుగుణంగా, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీగా ప్రభుత్వాలు పన్నులు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరల్లో అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయమై పునరాలోచించండి'' అని ఏపీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కీలకమైన సినిమాటోగ్రఫీ రెగ్యులరైజేషన్ ఎమెండ్మెంట్ బిల్లుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బ్లాక్ మార్కెట్ కు చెక్ పెడుతూ సినిమా టికెట్ల విక్రయాలన్నీ ఆన్ లైన్ పోర్టల్ లోనే జరగాలని అందులో పేర్కొన్నారు. బిల్లు ప్రకారం ఇకపై చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలూ రోజుకు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించాల్సి ఉంటుంది. అదనపు షోలకు అవకాశం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని స్వాగతిస్తున్నప్పటికీ.. రోజుకు నాలుగు షోల ప్రదర్శన - టికెట్ రేట్ల నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. దీని వల్ల పెద్ద సినిమాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఏపీ మంత్రి పేర్ని నాని దీనిపై మాట్లాడుతూ.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రాబట్టుకోవడానికి సినిమాటోగ్రఫీ చట్టానికి విరుద్ధంగా ఒకే రోజు అత్యధిక షోలు వేస్తున్నారని అంటున్నారు. వీటన్నింటినీ నియంత్రిస్తూ ప్రేక్షకుడికి టికెట్ ధరల భారం లేకుండా కొత్త విధానానికి మొగ్గు చూపామని.. నిర్ణీత సమయాల్లోనే సినిమా షోలు ప్రదర్శించేలా చూస్తామని గురువారం వెల్లడించారు.