Begin typing your search above and press return to search.

సుశాంత్ కేసు : 'ఈఎంఐ నేనే చెల్లిస్తున్నా.. ఇవిగో ప్రూఫ్స్'

By:  Tupaki Desk   |   15 Aug 2020 1:33 PM GMT
సుశాంత్ కేసు : ఈఎంఐ నేనే చెల్లిస్తున్నా.. ఇవిగో ప్రూఫ్స్
X
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతిపై సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిందితులపై మనీలాండరింగ్ చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఈడీ అధికారులు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు పలువురిని విచారించారు. అయితే ఈడీ విచారణలో సుశాంత్‌ నుంచి అతని మాజీ ప్రియురాలు అంకితా లోఖండే అక్రమంగా రూ. 4.5 కోట్ల ప్లాట్ ని స్వాధీనం చేసుకున్నట్లు రియా వెల్లడించినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముంబైలోని మలాడ్‌ లో ఉన్న ఈ ప్లాటులో ప్రస్తుతం అంకితా లోఖండే నివసిస్తున్నారని.. సుశాంత్‌ ఆ ప్లాట్ కి ఇన్స్టాల్మెంట్స్ చెల్లించాడని.. వారిద్దరూ విడిపోయిన తర్వాత కూడా సుశాంత్ అంకితను ప్లాట్‌ ఖాళీ చేయమని కోరలేదని రియా చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి.

కాగా అంకితా లోఖండే దీనిపై స్పందిస్తూ తాను నివసిస్తున్న ప్లాట్‌ కు సంబంధించిన ఇన్స్టాల్మెంట్స్ తనే చెల్లిస్తున్నానని.. తన ఫ్లాట్‌ కోసం సుశాంత్‌ ఏ రోజు ఈఎమ్‌ఐలు చెల్లించలేదని స్పష్టం చేసింది. ఈ విషయంపై అంకితా ట్వీట్ చేస్తూ.. తన ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కాగితాలతోపాటు ఆమె బ్యాంక్ స్టేట్మెంట్ లను షేర్ చేసింది. ''ఇక్కడ నేను నాపై వస్తున్న ఆరోపణలకు చెక్‌ పెడుతున్నాను. ఇవి నా ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ డాక్యూమెంట్స్.. నా బ్యాంక్‌ స్టేట్మెంట్ వివరాలు. నా ఫ్లాట్‌ ఈఎమ్ఐలను నేనే చెల్లిస్తున్నాను. ఇంతకంటే ఇంకేం చెప్పలేను'' అని అంకితా లోఖండే ట్వీట్‌ చేశారు. మరోవైపు ఈడీ అధికారులు రియా చక్రవర్తి మరియు సుశాంత్ సింగ్ కాల్ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన సీబీఐ త్వరలోనే నిందితులను విచారించనుందని తెలుస్తోంది.